ఏప్రిల్ 2 నుంచే సుంకాలు విధింపు
అమెరికా కాంగ్రెస్ సమావేశంలో ట్రంప్

వాషింగ్టన్: కెనడా, చైనా, మెక్సికోతోపాటు భారత్ పై కూడా సుంకాలు విధిస్తామని ఏప్రిల్ 2 నుంచి అమలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ఏప్రిల్ 1నుంచే సుంకాలను విధించాల్సి ఉన్నా ‘ఫూల్స్ డే’ కాబట్టి వాయిదా వేసి ఏప్రిల్ 2 నుంచి సుంకాలు అమలు చేస్తామన్నారు. ఎన్నో దేశాలు అమెరికాపై వందశాతం పన్ను విధిస్తున్నాయన్నారు. ఇప్పుడు అమెరికా కూడా అదే ధోరణిలో వెళుతుందన్నారు. గతంలో అమెరికా విధిస్తున్న సుంకాల కంటే ఆయా దేశాల సుంకాలే ఎక్కువన్నారు. ఇది న్యాయంగా లేనందున తాము కూడా సుంకాలను పెంచే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. భారత్ అమెరికా నుంచి ఏకంగా వందశాతం సుంకాలను వసూలు చేస్తుందన్నారు తమపై ఆయా దేశాలు ఏ రకమైన పన్నులు విధిస్తాయో తాము కూడా అదే రకమైన పన్ను విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ తమను కాదని దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తే ద్రవ్యేతర అడ్డంకులను సృష్టిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ సమావేశంలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధ విరమణ, అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టత, మాజీ అధ్యక్షుడు బైడెన్ విధానాలు తదితర విషయాలపై ట్రంప్ మాట్లాడారు.