ఏం ఇచ్చిందో వివరిస్తారా?
కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి

మోదీ ప్రభుత్వం కేటాయింపులను రాయాలని విలేఖరులకు విజ్ఞప్తి
రాష్ర్ట ప్రభుత్వం ఏం చేసిందని నిలదీత
బయ్యారంపై కేంద్రం ప్రకటన చేయలేదు
ఉత్పత్తికి ఆస్కారం లేకుంటే ప్రజల డబ్బు వృథా కాదా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి సుహృద్భావ వాతావరణం
నా తెలంగాణ, హన్మకొండ: కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేసిందో సవివరంగా రాయాలని మీడియా ప్రతినిధులను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రశ్నలు అడగడంతోపాటు వాటి వివరణ, నిజ నిజాలను కూడా రాస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ కోసం రూ. 10 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. మరో రూ. 10 లక్షల కోట్లు రుణాలరూపంలో ఇచ్చామన్నారు. రామగుండంలో రూ. 7వేల కోట్లతో యూరియా యూనిట్, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, జాతీయ రహదారుల కోసం రూ. 1.20 లక్షల కోట్లు, రూ. 80 వేల కోట్ల నిర్మాణం కొనసాగుతుందని, వరంగల్ స్మార్ట్ సిటీ పనులు, రామప్ప దేవాలయానికి రూ. 150 కోట్ల కేటాయింపు, యూనిస్కో గుర్తింపు, 40 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ, కొమురవెళ్లి రైల్వే స్టేషన్, సమ్మక్క సారాలమ్మ దేవాలయ అభివృద్ధికి రూ. 1000 కోట్లు, ఎయిమ్స్ ఆసుపత్రికి నిర్మాణానికి రూ.1350 కోట్లు, హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ కు పచ్చజెండా, ఎన్టీపీసీ 850 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, ఫ్లోటింగ్ యూనిట్, ఎరువులపై రూ. 60వేల కోట్ల సబ్సిడీ, కిసాన్ సన్మాన్ నిధి, గ్రామ పంచాయితీలకు రూ. 13వేల కోట్లు, ఇన్ కంట్యాక్స్ రూ. 12.75 లక్షల వరకు తగ్గింపు, జహీరాబాద్ లో ఇండస్ర్టీయల్ పార్కు, ఐదు కేజీల ఉచిత బియ్యం కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు.
2018లో బీఆర్ఎస్ చంకలు గుద్దుకున్నారు..
ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం హనుమకొండలో విలేఖరుల సమావేశంలో ప్రసంగించి తెలంగాణకు ఏం చేశారనే వారి నోళ్లను ఆధారాలతో సహా నిరూపించి మూయించారు. ప్రాగా టూల్స్, ఐడీపీఎల్, హెచ్ ఎంటీ, ఆల్వీన్ లాంటి అనేక సంస్థలు మూతపడ్డాయన్నారు. బయ్యారం సంస్థ స్థాపించాలంటే లాభమా? నష్టమా? అనే సర్వే ప్రకారం ముందుకు వెళతామన్నారు. బయ్యారంపై కేంద్రం ప్రకటన చేయలేదన్నారు. తామే ఏర్పాటు చేస్తామని 2018లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ లు చంకలు గుద్దుకున్నారని చెప్పారు. వాస్తవంగా ఆ సంస్థ రావాలనే తనకూ ఉందని, కానీ స్టీల్ లభ్యత ఉండదని తెలిసిన తరువాత ప్రజల డబ్బును నష్టం చేయలేమన్నారు.
బీజేపీకి సానుకూల ఫలితాలు..
తెలంగాణ రాష్ర్టంలో ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయ, పట్టభద్రుల మూడు ఎన్నికల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మూడుస్థానాల్లో బీజేపీకి సుహృద్భావ వాతావరణం కనిపిస్తుందని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు. బీజేపీకి ఈ ఎన్నికలు పూర్తి సానుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయని తెలిపారు.
అసంతృప్తి జ్వాలలు..
బీఆర్ ఎస్ పట్ల వ్యతిరేకతతో గతంలో ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు. ఆ మార్పు రేవంత్ రెడ్డి ఉపన్యాసాలు, రాహుల్ ప్రసంగాలతో మభ్యపెట్టడం వల్ల అధికారంలోకి వచ్చారు. కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్యారంటీలు, హామీలు అమలు చేయడంలో, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో హస్తం పూర్తి వైఫల్యం చెందింది. రైతులు, కూలీలు, మహిళలు, విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ అసంతృప్తి బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. బీఆర్ఎస్ కు పదేళ్లలో అసంతృప్తి రాగా, కాంగ్రెస్ ఏడాదిలోనే అసంతృప్తి సెగలు తగుతున్నాయి.
మండలిలో అన్ని సమస్యలు లేవనెత్తుతాం..
శాసనమండలి ప్రాధాన్యతను తగ్గించేలా బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. సభ్యులందరినీ మూకుమ్మడిగా టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. లెజిస్ర్టేటివ్ కౌన్సిల్ ఉద్దేశ్యాలను దెబ్బతీశారు. ఈ కౌన్సిల్ ఉద్దేశ్యం ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను లేవత్తుతామన్నారు. సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక సూచనలతో రాజ్యాంగ నిర్మాతలు లెజిస్ర్టేటివ్ కౌన్సిల్ కు రూపకల్పన చేశారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల కోసం, స్థానిక సంస్థల ఉద్యోగుల కోసం అదనపు అవకాశాలను కల్పించారు. వీరి నేతృత్వంలో లెజిస్ర్టేటివ్ కౌన్సిల్ లో శాసనసభ చట్టం చేసి పంపిస్తే దానిపైన మరింత లోతుగా విశ్లేషణ పంపిస్తే వాటిపైన విద్యావంతులు మరిన్ని సూచనలు చేసి ప్రభుత్వానికి పంపించేవారన్నారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను శాసనమండలి ద్వారా నెరవేర్చాలని మూడు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఉద్యమకారులు, జేఏసీలో పనిచేసిన సంఘాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్ధతునిస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
బీజేపీ విజయం..
సర్వోత్తం రెడ్డి వరంగల్, ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారని అన్ని సంఘాలు, ఉపాధ్యాయులు అభిమానించే వ్యక్తి అని అన్నారు. బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కొమురయ్య ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అంజిరెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రజలు, పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఆశీస్సులతో విజయం సాధిస్తామన్నారు.
నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్..
వందరోజుల్లో ఆరుగ్యారంటీ అమలు సంవత్సరం పూర్తి అయినా కాంగ్రెస్ వైఫల్యం చెందిందన్నారు. రైతాంగ, నిరుద్యోగులు, విద్యారంగం ఏ ఒక్కటి అమలు చేయలేని నిస్సాహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. ప్రతీ వారానికి ఒకసారి వైఫల్యాలను మళ్లించేందుకే ప్రజల్లో వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని కొత్త అంశాల వైపు మళ్లిస్తూ సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఢిల్లీ పర్యటనలో మర్మం ఏమీ లేదు.. బీజేపీపై విమర్శలు తప్పా..
ప్రతీవారం ఢిల్లీకి వెళ్లడమే సీఎం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని అక్కడి రాహుల్ మాటలను ఇక్కడకు మోసుకువచ్చి మోదీ, బీజేపీలపై విమర్శలు చేయడం తప్ప ఆయన చేపట్టే పర్యటనల్లో మర్మం ఏమీ లేదన్నారు. తెలంగాణ ప్రజలు అనేకమంది సీఎంలను, మంత్రులను చూశారని, పోలీసు నిర్భంధాలను, తూటాలను ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి హామీలను తుంగలో తొక్కేలా వైఫల్యాల నుంచి తప్పించుకుంటున్నారని అన్నారు.
హామీలపై నిలదీస్తాం..
శాసనమండలిలో అడుగడుగునా కాంగ్రెస్ హామీలను నిలదీస్తాం, ప్రశ్నిస్తామని ఇప్పటివరకు ఆ పార్టీకి ఇచ్చిన సమయం ఎప్పటికో పూర్తయి పోయిందని విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాల ప్రకటన, ఫీజు రీయింబర్స్ మెంట్, టీచీంగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు జీతాలు ఇవ్వలేని, బోధన కల్పించలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. టీచర్లు రిటైర్మెంట్ అయితే బెనిఫిట్స్ అందించలేని పరిస్థితుల్లో ఉందన్నారు. వేతన సవరణ కమిటీ ఇంతవరకూ ప్రభుత్వం దృష్టిలో ఆలోచించలేదన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ రాష్ర్టాన్ని దివాళా తీయించాయి..
నరేంద్ర మోదీ ప్రభుత్వం డీఎలు ఎప్పటికప్పుడు అందిస్తుందన్నారు. కానీ ఈ రాష్ర్టంలో అతీగతీ లేదన్నారు. బీఆర్ఎస్ అప్పు చేసి రాష్ర్టాన్ని దివాళా తీయించి కుటుంబం అంతా దోచుకున్నదని ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే దిశలో పాలిస్తుందన్నారు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ర్టాన్ని బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు అప్పుల పాలు చేశాయన్నారు. భూములు అమ్ముదాం, అప్పులపైనే ప్రభుత్వానికి దృష్టి ఉందని, హామీలు ఎలా అమలు చేస్తారని నిలదీశారు. ఈ ప్రభుత్వాలకు ఒక కార్యాచరణ ప్రణాళిక, రోడ్ మ్యాప్ లేదన్నారు. ఎక్కువ రోజులు ఆరోపణలు, విమర్శలు చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజల కడుపు నిండదన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు.
రాష్ర్టంలో దయనీయ పరిస్థితిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బీజేపీ ఉపాధ్యాయులకు, పట్టభద్రుకు, ప్రజలకు అండగా ఉండాలనే మూడు స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. పట్టింపు, సానుభూతి, అండగా ఉండే శక్తి ఉందని అందుకే తాము పోటీలో ఉన్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
ఏ ఒక్క బీసీ సంఘమైన కాంగ్రెస్ వేసిన సర్వేకు ఆమోదం తెలిపారా?అని ప్రశ్నించారు. బీజేపీ కులగణనను సమర్థిస్తుందన్నారు. బీజేపీ ఎప్పుడైనా బీఆర్ఎస్ తో కలిసిందా? అని అడిగారు. తాము కుంభకోణాలు, అవినీతిని ఎప్పటికీ సహించబోమన్నారు. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.