ఎస్ఎస్ సీటీయూకు తొలి వైస్ చాన్స్ లర్ నియామకం
ప్రొఫెసర్ యడవల్లి లక్ష్మీ శ్రీనివాస్ కు బాధ్యతలు

నా తెలంగాణ, ములుగు: అరోరా యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ యడవల్లి లక్ష్మీ శ్రీనివాస్ ములుగు సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (ఎస్ఎస్ సీటీయూ)కి తొలి వైస్ చాన్స్ లర్ గా నియామకం అయ్యారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు జిల్లాలో ఉన్న సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి తొలిసారిగా వీసిని నియమించింది. ఈయన ఐదేళ్లపాటు యూనివర్సిటీ వీసీగా పదవిలో కొనసాగనున్నారు.
ఈ యూనివర్సిటీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రం పెద్దపీట వేసింది. రూ. 900 కోట్లను కేటాయించింది. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో 35 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించేలా చూస్తానని కూడా కేంద్రమంత్రి స్పష్టం చేశారు. 2024లో తాత్కాలిక భవనాలలో యూనివర్సిటీని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పలువురు రాష్ట్రమంత్రులతో కలిసి ప్రారంభించారు.