మారిషస్ లో మోదీకి ఘన స్వాగతం
Modi receives warm welcome in Mauritius

పోర్ట్ లూయిస్: మారిషస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. మంగళవారం వేకువజామున ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం మారిషస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులం స్వయంగా ప్రధాని మోదీకి పూలమాలలతో స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో మారిషస్ ప్రధానితో పాటు ఉప ప్రధాన మంత్రి, మారిషస్ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ అసెంబ్లీ స్పీకర్, ప్రతిపక్ష నాయకుడు, విదేశాంగ మంత్రి, క్యాబినెట్ కార్యదర్శి, గ్రాండ్ పోర్ట్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ చైర్పర్సన్, అనేక మంది ప్రముఖులు ఉన్నారు. భారత ప్రధానమంత్రి రాక సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులు, దౌత్య దళాలు, మత పెద్దలు సహా మొత్తం 200 మంది ప్రముఖులు హాజరయ్యారు. మార్చి 12న జరిగే దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య పలు అంశాలపై సుధీర్ఘ చర్చలు నిర్వహించనున్నారు. పలు ఒప్పందాలు కూడా చేసుకోనున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జై స్వాల్ వివరించారు.