అణుశక్తితో విద్యుత్ ఉత్పత్తి
బడ్జెట్ లో రూ. 20వేల కోట్ల కేటాయింపు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత దేశ అణుశక్తిని బలోపేతం చేసేందుకు రూ. 20 వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. ఈ నిధులను అణు రియాక్టర్ల నిర్మాణ ప్రాజెక్టుకు వినియోగించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలోని ఏ ప్రాంతానికైనా విద్యుత్ సరఫరాను మరింత సులువు చేయనున్నారు. బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం అణురంగానికి కీలక ప్రాధాన్యతనిచ్చారు. ఈ రంగంలో ప్రైవేటు సంస్థలకు ఆహ్వానం పలికారు. అదే సమయంలో అణుశక్తి చట్టంలో మార్పులు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2047 నాటికి కనీసం 100 గిగావాట్ల అణుశక్తిని ఉపయోగించి విద్యుత్ ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2033 నాటకి ఐదు చిన్న అణు రియాక్టర్ల ప్రాజెక్టులను నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 462 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ఇందులో అణుశక్తి వాటా కేవలం 8 గిగావాట్లు మాత్రమే.
చిన్న మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్లు..
చిన్న మాడ్యులర్ రియాక్టర్లు ఇవి చాలా తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. సాంప్రదాయ అణు విద్యుత్ ప్లాంట్ల కంటే పరిమాణంలో చాలా చిన్నవి. వీటిని దేశంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఒక్క రియాక్టర్ ద్వారా 300 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయొచ్చు. అదే సమయంలో పెద్ద మాడ్యులర్ రియాక్టర్లయితే వెయ్యి మెగావాట్ల వరకు విద్యుత్ ను ఉత్పత్తి చేయొచ్చు. ఒక చోట నిర్మించే అణు ప్లాంట్ ల కన్నా వీటి నిర్మాణంలో ఖర్చు చాలా తక్కువ. ఆఫ్ గ్రిడ ఫ్రాంతాలకు కూడా విద్యుత్ ను సరఫరా చేయొచ్చు. ఈ చిన్న మాడ్యులర్ రియాక్టర్లలో ఇంధనంగా యూరేనియంను ఉపయోగిస్తారు. ఈ పదార్థం అధిక శక్తి ఉద్గారాల (శక్తి)ను విడుదల చేస్తుంది.