ఈపీఎఫ్​ వో దేవాలయమే!

కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్​ మాండవీయా

Mar 6, 2025 - 20:22
 0
ఈపీఎఫ్​ వో దేవాలయమే!

కార్మికుల సమస్యల పరిష్కారంలో మరో ముందడుగు
డిజిటలీకరణతో సేవలు మరింత విస్తృతం
భవిష్యత్​ లో ఏటీఎం నుంచి కార్యకలాపాలు
301 నెంబర్​ తో మరిన్ని సేవలకు ప్రణాళికలు
అడ్డుంకులను తొలగించాం
కార్మిక శక్తియే దేశానికి వెన్నెముక

నా తెలంగాణ, హైదరాబాద్​: కార్మికులకు సేవలందించే ఈపీఎఫ్​ వో దేవాలయమేనని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్​ మాండవీయా అన్నారు. ఈ దేవాలయం ద్వారా కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో మరింత ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. భవిష్యత్​ లో కార్యాలయాలకే రాకుండా డిజిటల్​ సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు వివరించారు. గురువారం ఈపీఎఫ్​ వో నూతన జోనల్​ కార్యాలయాన్ని బేగంపేటలో కేంద్రమంత్రి మన్సుఖ్​ మాండవీయా ప్రారంభించారు. మోదీ నేతృత్వంలో కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. దేశంలో అత్యధిక ఎక్కువ నిధులున్న సంస్థ ఈపీఎఫ్​వో అన్నారు. ఈ కార్యాలయాలకు వచ్చే కార్మికుల సమస్యలను, క్లైయిమ్​ లను త్వరగా పరిష్కరించేలా చొరవ తీసుకోవాలన్నారు. కార్మికుల డబ్బుతో సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులను జమ చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ పనిచేసేవారైనా నేరుగా బ్యాంకుల నుంచే విత్​ డ్రా సౌకర్యాన్ని కల్పించామన్నారు. కార్మికుల సేవల కోసం 201 టోల్​ ఫ్రీ నెంబర్​ ను కూడా ప్రారంభించామని చెప్పారు. భవిష్యత్​ లో 301 నెంబర్​ తో మరిన్ని సేవలను అందించేలా ప్రణాళిక రూపొందించి పనులు కొనసాగిస్తున్నామన్నారు. యూఎఎన్​ నెంబర్​ ద్వారా బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించినట్లే కార్మికులు సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి మాండవీయా వివరించారు. గతంలో చిన్నచిన్న ఆటంకాలు, సమస్యలు అనేకం ఉండేవన్నారు. ప్రస్తుతం వాటన్నింటినీ దశల వారీగా తొలగించామన్నారు. మరిన్ని సేవలను విస్తృతం చేసేందుకు మోదీ నేతృత్వంలో మెరుగైన విధానాలను అవలంభిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్​ లో ఈపీఎఫ్​ వో లావాదేవీలు ఏటీఎం ద్వారా కూడా నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈపీఎఫ్​ వో నూతన ఇన్​ఫ్​రాస్ర్టక్చర్​ సేవలు విస్తృతం చేయడంతో కార్మికులకు సేవలందించేందుకు ఎళ్లవేళలా సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. దేశాభివృద్ధికి వెన్నెముక కార్మిక శక్తియేనని పునరుద్ఘాటించారు. మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో పనివిధానంలో కూడా మార్పులను తీసుకువస్తున్నట్లు చెప్పారు. కార్మికుల శ్రేయస్సు కోసం అన్ని విధాల సిద్ధంగా ఉండి పనిచేస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్​ మాండవీయా స్పష్టం చేశారు.