లడ్కీ బెహన్ కొనసాగుతుంది.. అపోహలొద్దు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే

ముంబాయి: మహారాష్ట్రలో లడ్కీ బెహన్ యోజన నిరంతరాయంగా కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అన్నారు. ఈ పథకంపై ఉన్న అనుమానాలు, అపోహలపై మంగళవారం జరిగిన ఓ సభలో మాట్లాడుతూ సమాధానమిచ్చారు. మహాయుతి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. లడ్కీ బెహన్ పథకానికి ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగిస్తామన్నారు. ఈ పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబంఓని మహిళకు రూ. 1,500 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. బీజేపీతో కలిసి శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్)లు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నామని తెలిపారు. ఈ పథకం ఎప్పటికీ మూసివేయబోమని గుర్తించాలన్నారు. విపక్షాలు ఈ పథకంపై ప్రజల్లో సృష్టిస్తున్న అనుమానాలు, అపోహలను నమ్మరాదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వారు తమకు మరో అవకాశాన్ని కల్పించారని, అది తమ భాగ్యంగా భావిస్తున్నామని, దీంతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. అభివృద్ధి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేస్తామన్నారు. మహారాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించిన క్లస్టర్ అభివృద్ధి పథకాన్ని షిండే ప్రశంసించారు. అదే సమయంలో విపక్షాల నేతృత్వంలోని మహాఘట్ బంధన్ కేవలం చిత్రాలు, దృశ్యాలను చూపుతూ ఇదిగో ప్రాజెక్టు, అదిగో ప్రాజెక్టు అని కాలం వెళ్లబుచ్చిందన్నారు. మహాయుతి ప్రభుత్వం మహారాష్ట్ర అభివృద్ధికి సమర్థవంతమైన చర్యలు తీసుకుంటుందన్నారు.