పూజ్యనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్
జయంతి వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

నా తెలంగాణ, హైదరాబాద్: మహనీయుడు, పూజ్యనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గిరిజనుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని కొనియాడారు. ధర్మబద్ధంగా, ఆధ్యాత్మిక జీవనశైలిని అనుసరిస్తూ ప్రకృతిని, సహజ వనరులను కాపాడుకోవడాన్ని ఆచరించి సమాజానికి మార్గదర్శకంగా నిలిచారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. గురువారం సంత్ సేవాలాల్ 286వ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన వేడుకల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా బంజారా ధార్మిక వ్యాప్తి మహాసంఘ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగ్ బండారి హోమంలో పాల్గొని ప్రజల శ్రేయస్సును కాంక్షించారు. బంజారాలపై జరిగే కుట్రలను తిప్పికొట్టిన వ్యక్తి ఎంతోమంది యోధులను తీర్చిదిద్దిన వ్యక్తి అన్నారు. ఆయన జీవనం నిరాడంబరమైనదని, స్వచ్ఛత, శాఖాహారాన్ని తీసుకోవడం, మహిళలను గౌరవించడం, మంచి బోధనలు దేశ ప్రజలకు ఆచరించాల్సిన విధానాలని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.