మొహల్లా క్లినిక్ అవినీతిపై విచారణ
ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ సింగ్

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆప్ హయాంలో కొనసాగిన మొహల్లా క్లినిక్ లలో అవినీతిపై దర్యాప్తు చేస్తామని ఢిల్లీ ఆరోగ్య, రవాణ మంత్రి డాక్టర్ పంకజ్ సింగ్ అన్నారు. గురువారం మంత్రి పదవిని చేపట్టాక శుక్రవారం తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. మొహల్లా క్లినిక్ లపై అనేక ఫిర్యాదులందాయన్నారు. అవినీతికి పాల్పడిన బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. గురువారం నుంచే తమ పనిని ప్రారంభించామన్నారు. మోదీ నేతృత్వంలో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ పథకాలను ఆపబోమని చెప్పారు. అవినీతి సంపాదనను వెనక్కి తీసుకువస్తామని నిందితులను వదలబోమన్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు కొనసాగించాలన్నదే తమ అభిమతమని చెప్పారు. బస్సులు కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్లుగా తమ దృష్టికి వచ్చిందని, వెనుక భాగంలో ప్రకటనలు ముద్రించారని సమాచారం ఉందని అన్నారు. దీనిపై పూర్తి విచారణ కొనసాగిస్తామన్నారు. మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణం కొనసాగుతుందన్నారు.
ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖ మంత్రి రవీంద్ర ఇంద్రజ సింగ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. సాంఘిక సంక్షేమం, షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమం, సహకారం అందిస్తామన్నారు. భవిష్యత్ సవాళ్లను అధిగమిస్తానని ఇంద్రజసింగ్ స్పష్టం చేశారు.