లోక్ సభలో ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు !
Immigration and Foreigners Bill in Lok Sabha!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వలసవాద చట్టాల స్థానంలో ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు, 2025’ లోక్ సభలో కేంద్రమంత్రి నిత్యానందరాయ్ మంగళవారం ప్రవేశపెట్టారు. అక్రమచొరబాట్లపై ఉక్కుపాదం మోపేలా బిల్లులో చర్యలున్నాయి. ఈ బిల్లు ప్రకారం భారత్ లోకి అక్రమంగా చొరబడితే రూ. 5 లక్షల జరిమానాతోపాటు ఏడేళ్ల జైలు శిక్షను విధించనున్నారు. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులకు మరింత స్వేచ్ఛనిచ్చినట్లయ్యింది. బిల్లుతో మరిన్ని అధికారాలు సొంతమవుతాయి. అక్రమంగా వీసాలు, పాస్ పోర్టులు లభించినా ఈ చట్టం ప్రకారమే చర్యలు తీసుకోనున్నారు. బ్రిటిష్ కాలంలో రూపొందించిన చట్టాలు భారత సార్వభౌమత్వానికి కీడు కలిగించేలా ఉండడంతో ప్రభుత్వం ఈ బిల్లులోని పలు అంశాలపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. వాటిలోని లోపాలను సవరించింది. ఝార్ఖండ్, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ర్టాల్లోకి బంగ్లాదేశీయులు అక్రమంగా చొరబడుతున్నారు. ఈ బిల్లుతో ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఇప్పటికే ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది.
పాస్పోర్ట్ (ఎంట్రీ ఇన్టూ ఇండియా) యాక్ట్ 1920, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939, ఫారినర్స్ యాక్ట్ 1946, ది ఇమ్మిగ్రేషన్ (క్యారియర్స్ లయబిలిటీ) యాక్ట్ 2000 వంటి చట్టాలు అమల్లో ఉన్నాయి. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ చట్టాలను రూపొందించారు. ఈ చట్టాల్లోని నిబంధనలు విరుద్ధంగా ఉండడంతో పలు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. దీంతో పాతచట్టాల స్థానంలో ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు, 2025’ను తీసుకువచ్చారు.
నిరసనలు..
బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా విపక్ష పార్టీలు నిరసనలు చేపట్టాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ పలు అంశాలపై విపక్షాలు ప్రవేశపెట్టిన నోటీసులను తీసుకునేందుకు అంగీకరించలేదు. 21 నోటీసులను ప్రతిపక్షాలు ప్రతిపాదించాయి. 18 నోటీసులను టీఎంసీ, కాంగ్రెస్, బీజేడీ, ఆప్ డూప్లికేట్ ఓటరు ఐడీ అంశంపైనే ప్రతిపాదించాయి. నోటీసులను అంగీకరించకపోవడంతో నిరసనలతో కొద్దిసేపు సభను వాయిదా వేశారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు నిరసన చేపట్టాయి.
మారన్ పై స్పీకర్ మండిపాటు..
మరోవైపు డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ ఓం బిర్లా తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మారన్ నిప్ (జాతీయ విద్యావిధానం–ఎన్ఇపీ)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మారన్ పై చర్య తీసుకునేందుకు ప్రభుత్వం ప్రతిపాదన తేవాలన్నారు.
బీజేపీ ఎంపీ రేఖా శర్మ..
రాజ్యసభ ఎంపీ రేఖా శర్మ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు కేవలం విభజన రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఏ భాషైనా నేర్చుకోవడంలో తప్పేంటని నిలదీశారు. భవిష్యత్ లో ప్రపంచంలో ఎవ్వరితోనైనా కనెక్ట్ కావాలంటే భాషదే అత్యంత ప్రాముఖ్యత అన్నారు. భాష ప్రాతిపదికన ప్రజలను ఎందుకు విడగొట్టాలని అనుకుంటున్నారో? ప్రజలకు అర్థం అవుతుందన్నారు.