శతాబ్ధానికి ఒక్కరే మోదీ లాంటివారు!
డిప్యూటీ సీఎం దియా కుమారి

జైపూర్: ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి శతాబ్ధానికి ఒక్కరు మాత్రమే పుడతారని రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దియా కుమారి అన్నారు. మంగళవారం ఓ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించారు. రాజకీయాల్లో అత్యంత కష్టతరమైన ప్రయాణాన్ని కూడా తట్టుకొని ఈ స్థాయికి చేరారని అన్నారు. సమాజం ఆలోచనలు మార్చే విధానం, యువత, ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు సామాన్యమైనవి కావన్నారు. అంత ఆదర్శవంతమైన వ్యక్తి మోదీ అన్నారు. బేటీ బచావో, బేటీ పఢావో, స్వచ్ఛత, ఉజ్వల యోజన ద్వారా పేదలు, రైతులు, యువతకు సహాయం చేశారని కొనియాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలో రాజస్థాన్ ను ఉత్తమంగా తీర్చిదిద్దడమే తన కర్తవ్యమని దియా కుమారి అన్నారు. కాంగ్రెస్ కేవలం ఆరోపణలు చేయడానికే తప్ప పనిచేయదన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఆ పార్టీ నాయకులు తమలో తామే పోరాడుకుంటే దేశ భవిష్యత్ ను విస్మరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ పార్టీ క్రమశిక్షణతో కూడిన పార్టీ అని చెప్పారు. అగ్రనాయకత్వం అడుగుజాడల్లో, దిశా నిర్దేశకత్వంలో దేశ పటిష్ఠానికి పనిచేస్తామని దియా కుమారి చెప్పారు.