భారత్–ఖతార్ భవిష్యత్ వృద్ధి ఆశాజనకం
Future growth of India-Qatar is promising

సీఐఐ సదస్సులో కేంద్రమంత్రి పీయూష్ గోయల్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్–ఖతార్ ల మధ్య భవిష్యత్ వృద్ధి కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సెమీ కండక్టర్స్ వంటి రంగాలలో ఉండనుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మంగళవారం న్యూ ఢిల్లీలో ఇరుదేశాల మధ్య జాయింట్ బిజినెస్ ఫోరం సమావేశం నిర్వహించారు. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ భాగస్వామ్యంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహించిన ఈ ఫోరం రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తరించడంపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ 2047 నాటికి భారత్ 30–35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్ సిటీ)లో పెట్టుబడులు పెట్టాలని ఖతార్ వ్యాపారులను ఆహ్వానించారు. పరస్పర ఆసక్తి ఉన్న రంగాలను గుర్తించడానికి జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును ప్రతిపాదించామన్నారు.
అనంతరం ఖతార్ పరిశ్రమల శాఖ మంత్రి షేక్ ఫైసల్ బిన్ థానీ మాట్లాడారు. భారత్ ఖతార్ మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించిందన్నారు. రెండు దేశాల మధ్య మరిన్ని పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఖతార్ ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలలో భారత్ పెట్టుబడులు పెంచుతుందన్నారు. ఆయా రంగాల్లో సీఐఐ–ఖతార్ బిజినెస్ అసోసియేషన్ మధ్య ‘ఇన్వెస్ట్ ఇండియా, ఇన్వెస్ట్ ఖతార్’ మధ్య రెండు ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. కాగా ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు భారత్ నిర్వహించే స్టార్టప్ ఇండియా మహాకుంభ్ –2025లో ఖతార్ పాల్గొనాలని డీపీ ఐఐటీ జాయింట్ సెక్రెటరీ సంజీవ్ కోరారు.