ఈవీఎం డేటా తొలగించొద్దు
ఎన్నికల కమిషన్ కు సుప్రీం ఆదేశం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఈవీఎంలోని డేటాను తమ అనుమతి లేకుండా తొలగించడం చేయొద్దని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. సుప్రీంలో డేటా తొలగింపుపై దాఖలైన పిటిషన్ ను మంగళవారం సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషన్ ను హరియాణా మాజీ మంత్రి కరణ్ సింగ్ దలాల్, ఎమ్మెల్యే లఖన్ కుమార్ సింగ్లా లు దాఖలు చేశారు. ఈవీఎం వెరిఫికేషన్ కోసం సమగ్ర విధానాన్ని రూపొందించాలని సుప్రీంను కోరారు. ఈవీఎం మెమొరీ, మైక్రో కంట్రోలర్ ను తొలగించే ప్రక్రియ గురించి ఎన్నికల సంఘం సుప్రీం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఈవీఎం..
– తొలిసారిగా భారత్ లో ఈవీఎంలు 1982 కేరళ పారావూర్ అసెంబ్లీ ఎన్నికల్లో 50 పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించారు.
– ఈ ఎన్నికల ఫలితాలను ఓడిన అభ్యర్థి కోర్టులో సవాల్ చేశారు. దీంతో మరోమారు ఫలితాలను సరిచూసి ఎలాంటి అవకతవకలు, అనుమానాలు అక్కర్లేదని కోర్టు తీర్పు నిచ్చింది.
– సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1988లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 చట్టంలో సెక్షన్ 61ని జోడించారు. దీంతో ఈవీఎంల వినియోగానికి మార్గం సుగమమైంది.
– 1998 నవంబర్ మధ్యప్రదేశ్ లోని ఐదు, రాజస్థాన్ లోని ఆరు, ఢిల్లీలోని ఆరు అసెంబ్లీ స్థానాలకు ఈవీఎంల ద్వారా ఎన్నికలను నిర్వహించారు.
– 2004 దేశంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల్లో 17.5 లక్షల ఈవీఎంలను వినియోగించారు.
– ఈవీఎంలలో రెండు యూనిట్లుంటాయి. బ్యాలెట్ యూనిట్ ద్వారా ఓటు వేస్తారు. ఓటింగ్ పూర్తి అయ్యాక ప్రిసైడింగ్ అధికారి తన వద్ద ఉన్న కంట్రోల్ యూనిట్ ను సీజ్ చేస్తారు. దీంతో ఫలితాలు ఈవీఎంలలో నిక్షిప్తం అవుతాయి.
– ఒక్క ఈవీఎంలో రెండు వేల ఓట్లు నిక్షిప్తం అవుతాయి. బ్యాలెటింగ్ యూనిట్ లో 16 మంది అభ్యర్థుల పేర్లను నమోదుకు అవకాశం ఉంటుంది. ఎక్కువమంది అభ్యర్థులుంటే రెండు ఈవీఎంలను వినియోగిస్తారు.
– 1989–90లో ఈవీఎంల ధర రూ. 5500. ఈ ఈవీఎంలు విద్యుత్ లేకపోయినా బ్యాటరీతో పనిచేసేలా రూపొందించారు.