సంబురాలపై దాడులు.. టీఎంసీపై బీజేపీ ఆగ్రహం
Attacks on Sambura...BJP is angry with TMC

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ హోళీ సంబురాల్లో దాడులపై ఆ రాష్ర్ట ప్రభుత్వం హింసను దాచి పెడుతుందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సుకాంత మజుందార్, మరో నాయకుడు సువేందు అధికారిలు ఆరోపించారు. శుక్రవారం హోళీ సంబురాల సందర్భంగా పలుచోట్ల ఘర్షణలు, రాళ్ల దాడులు చోటు చేసుకున్నాయి. దీంతో టీఎంసీ ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్ ను కూడా నిలిపివేసి ఈ ఘటనను బయటి ప్రపంచానికి తెలియనీయడం లేదని వీరు శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. బెంగాల్ బీర్బూమిలో ఇంటర్నెట్ షట్ డౌన్ ఎందుకు చేశారని నిలదీశారు. బీర్బూమిలోని సైంథియా ప్రాంతంలో ఐదు గ్రామ పంచాయితీ ప్రాంతాలలో ఈ గొడవలు మరింత ముదరడంతో ప్రభుత్వం ఇంటర్నెట్ ను నిలిపివేసిందన్నారు. అంతపెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు విధించడంపై ప్రభుత్వం కనీసం ప్రకటన కూడా చేయడం లేదని మండిపడ్డారు. సాధారణ స్థితిని తేలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. వెంటనే బెంగాల్ గవర్నర్ కల్పించుకొని ప్రభుత్వంతో నివేదిక కోరి తగిన చర్యలు తీసుకోవాలని ఇరువురు నేతలు కోరారు. మమత బెనర్జీ పరిపాలనలో పోలీసులు నిష్ర్కియాత్మకంగా మారారని విమర్శించారు.