సీతమ్మకు అతిపెద్ద దేవాలయ నిర్మాణం ఆర్టికల్ 370 రద్దుతో రక్తపుటేరులు పారతాయా?
హిందువులను భయపెడతారా? కర్పూరీనీ గౌరవించుకోరా? పీవోకేను స్వాధీనం పక్కా ఎవ్వరికీ భయపడబోం బిహార్ అభివృద్ధికి రూ.11లక్షల 33వేల కోట్లు కూటమిలో ఎవ్వరికీ వారే ప్రధానులు మధుబని, సీతామర్హి సభలో కేంద్రమంత్రి అమిత్ షా

పాట్నా: సీతామర్హిలో సీతమ్మవారికి అతిపెద్ద దేవాలయాన్ని బీజేపీ నిర్మిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో బిహార్ ప్రజలకు ఏం సంబంధమని ఖర్గే ప్రకటించడంపై మండిపడ్డారు. రక్తపుటేరులు ప్రవహిస్తాయని దేశ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తారా? అని రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను భయపెట్టే విధానాలకు పాల్పడతారా? అని మండిపడ్డారు. గురువారం మంత్రి అమిత్ షా మధుబని, సీతామర్హిలో జరిగిన సభల్లో ప్రసంగించారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పై విమర్శల బాణాలు విసిరారు.
పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కర్పూరీ ఠాకూర్ ను గౌరవించుకోలేని పార్టీ, నాయకులు ఉండడం దురదృష్టకరమని లాలూను విమర్శించారు. చివరకు ఆయనకు గౌరవాన్ని బీజేపీ ఇవ్వాల్సి రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.
భారత్ నుంచి ఒక్క గులకరాయిని కూడా తీసుకుపోతే సహించేది లేదని అమిత్ షా స్పష్టం చేశారు. పీవోకేను ఖచ్చితంగా స్వాధీనం చేసుకొని తీరుతామన్నారు. ఎవ్వరికీ భయపడబోమని స్పష్టం చేశారు.
గోవులను హత్య చేసిన వారిని తలకిందులుగా వేలాడదీస్తామన్నారు. ఇష్టారీతిన గో హత్యపై మండిపడ్డారు.
కాంగ్రెస్, ఆర్జేడీలు బిహార్ కు ఏం చేశాయని ప్రశ్నించారు. మోదీ నేతృత్వంలో పదేళ్లలో రూ. 11 లక్షల 33 వేల కోట్లు ఇచ్చామన్నారు. పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
ఇండీ కూటమిలో అందరూ ప్రధానులే అన్నారు. ఎవరికి వారే ప్రధానిగా చెప్పుకుంటూ పగటి కలలు కంటున్నారని పేర్కొన్నారు. ఎవరు ప్రధాని అభ్యర్థి అని ప్రకటించే కనీస ధైర్యం కూడా వారిలో లేదని అమిత్ షా విమర్శించారు.