శీష్ మహల్ దర్యాప్తునకు సీవీసీ ఉత్తర్వులు
కేజ్రీవాల్ కు పెరగనున్న కష్టాలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు కష్టాలు పెరగనున్నాయి. ఆయన నివాసం శీష్ హహల్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టాలని సీవీసీ (సెంట్రల్ విజిలెన్స్ కమిషన్) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రజా పనుల శాఖ (సీపీడబ్ల్యూడీ) నివేదిక వచ్చిన తర్వాత ఈ ఉత్తర్వులను జారీ చేసింది. 40,000 చదరపు గజాల (8 ఎకరాలు)లో నిర్మించిన బంగ్లా నిర్మాణంలో అనేక నిబంధనలు ఉల్లంఘించబడ్డాయని నివేదిక పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ బంగ్లా పునరుద్ధరణకు రూ.45 కోట్లకు పైగా ఖర్చు చేశారని, ఆ ఖర్చు కాస్త నిర్మాణం పూర్తయ్యే నాటికి 90 కోట్లకు పైగా చేరిందనే ఆరోపణలున్నాయి.
భవన నిర్మాణం, విలాసవంతమైన వస్తువుల ఖర్చుపై విచారణ చేపట్టాలని పేర్కొంది. శీష్ మహల్ పై విచారణ చేపట్టాలని విజేంద్ర గుప్తా తోపాటు బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా గవర్నర్ వీకే సక్సేనాకు కూడా లేఖ రాశారు. నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించారని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆక్రమణ నిర్మాణమని వెంటనే నేలమట్టం చేయాలన్నారు. అధికారిక నివాసం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.