ఉగ్రవాదులతో సంబంధం ముగ్గురు ఉద్యోగులు తొలగింపు
Termination of three employees linked to terrorists

ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్ మనోజ్ సిన్హా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ఉగ్రవాద సంబంధాల కేసులో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులకు తొలగిస్తూ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా జమ్మూకశ్మీర్ లో వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఉగ్రవాదులతో దగ్గరి సంబంధాలను కలిగి ఉండడం, ఇక్కడి సమాచారాన్ని వారికి చేరవేయడం, ఉగ్రవాదులకు సహాయం చేయడం లాంటివి చేస్తున్నారు. కానిస్టేబుల్ ఫిర్దౌస్ భట్ లష్కర్ ఉగ్రవాదులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాడు. ప్రస్తుతం ఇతను జైలులో ఉన్నాడు. అనంత్ నాగ్ లో ఇద్దరు ఉగ్రవాదులు వసీం షా, అద్నాన్ బేగ్ లను భద్రతా దళాలు అరెస్టు చేసి విచారించగా ఇతని పూర్తి పాత్ర వెల్లడైంది. పాక్ ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున రహాస్య సమాచారాన్ని అందజేస్తూ వారికి సహాయం చేస్తున్నట్లు గుర్తించారు. ఇక రెండో ఉద్యోగి అటవీశాఖకు చెందిన నిసార్ అహ్మద్. ఇతను హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది. ఈ ఉగ్రవాద సంస్థకు ఇక్కడి కీలక సమాచారం సేకరించి పంపేవాడు. ఆ సమాచారంతో ఉగ్రవాదులు దాడులకు పాల్పడేవారు. ఇతని సమాచారంతోనే అనంత్ నాగ్ లో ల్యాండ్ మైన్ దాడిలో జమ్మూకశ్మీర్ విద్యుత్ శాఖ మంత్రి గులాంహసన్ భట్ మృతిచెందాడు. ఇతనిపై టాడా చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న రియాసీ నివాసి అష్రఫ్ భట్. లష్కరే తోయిబాకు విధేయుడిగా ఉన్నాడు. పలు దాడుల సందర్భంగా ఉగ్రవాదులు ఇచ్చిన కీలక సమాచారం ద్వారా ఆరా తీస్తే ఇతను పాక్ నివాసి మోస్ట్ వాంటెడ్ మొహమ్మద్ ఖాసిం అని తెలిసింది. ప్రస్తుతం అష్రఫ్ భట్ రియాసి జైలులో ఉన్నాడు. వీరంతా జమ్మూకశ్మీర్ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తూ ఉగ్రవాదులుగా ముద్రపడి, వారికి సహాయం చేస్తూ దేశ సమగ్రతకు భంగం వాటిల్లే చర్యలకు పాల్పడడంపై ఇటీవలే జమ్మూకశ్మీర్ ఉన్నతాధికారులతో గవర్నర్ భేటీలో వీరిని సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. దీంతో గవర్నర్ శనివారం వీరి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.