డ్రగ్స్ పై పోరాటం కొనసాగిస్తాం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో డ్రగ్స్ పై పోరాటం కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈ పోరాటంలో కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు. భారత్ ను డ్రగ్స్ నుంచి విముక్తి చేసే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తామన్నారు. ఈ మహామ్మారి వల్ల యువతపై, దేశ ప్రజలపై చెడు ప్రభావం పడుతుందని అమిత్ షా అన్నారు.
శనివారం డ్రగ్ ట్రాఫికింగ్, జాతీయ భద్రతపై ప్రాంతీయ సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 2004 నుంచి 2014 వరకు 3.63లక్షల కిలోలు రూ. 8,150 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోగా, గత పదేళ్లలో 2014 నుంచి 2014 వరకు 24 లక్షల కిలోల రూ. 56,851 కోట్లవైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. డ్రగ్స్ ఉపయోగం పెరుగుతుందని కొంతమంది ఆరోపిస్తున్నారని అన్నారు. డ్రగ్స్ వినియోగం ముందునుంచి ఉన్నా కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఆ నెట్ వర్క్ ను నాశనం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టగలుగుతున్నామని షా వివరించారు. అన్ని విభాగాలు డ్రగ్స్ వినియోగాన్ని, స్మగ్లింగ్ ను పూర్తిగా అరికట్టేందుకు అహార్నిశలు పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.
క్రిప్టోకరెన్సీ, ఆన్ లైన్ మోసాలు, డ్రోన్ ల ఉపయోగాలు సవాళ్లు విసురుతున్నాయన్నారు. వీటిని కూడా సాంకేతికంగా ఎదుర్కొంటున్నామని తెలిపారు. దేశ ప్రజలు, యువత వీటిపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని అమిత్ షా పునరుద్ఘాటించారు.