లాలూ కుటుంబానికి సమన్లు
మార్చి 11న కోర్టు హాజరుకావాలని ఆదేశం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలూ కుటుంబానికి మరోసారి షాక్ తగిలింది. మంగళవారం కేసు విచారణ సందర్భంగా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మార్చి 11న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన తుది చార్జీషీట్ ను పరిగణనలోకి తీసుకొని లాలూ యాదవ్, ఆయన కుమారుడు తేజ్ ప్రతాప్, కుమార్తె హేమా యాదవ్ సహా నిందితులందరికీ కోర్టు సమన్లు జారీ చేసింది. అంతకుముందు కోర్టు నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఈ కేసులో లాలూ యాదవ్తో పాటు మరో 78 మందిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో 30 మంది ప్రభుత్వ ఉద్యోగులు నిందితులుగా ఉన్నారు. రైల్వే బోర్డు అధికారి ఆర్కె మహాజన్పై కేసు నమోదు చేయడానికి మేము కోర్టు నుంచి అనుమతి తీసుకున్నామని సిబిఐ తెలిపింది. అతనికి వ్యతిరేకంగా సాక్షుల జాబితా కూడా సిద్ధంగా ఉందని పేర్కొంది. ఈ విషయంలో కోర్టు తదుపరి నిర్ణయం తీసుకోనుంది.