లక్నో: బహ్రెచ్ లో రామ్ గోపాల్ చావుకు కారణమైన ఇద్దరిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ లో నిందితులు సర్పరాజ్, తాలిబ్ ల కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. గురువారం వీరిద్దరు నేపాల్ పారిపోయేందుకు ప్రయత్నాల్లో ఉండగా సర్పరాజ్ ఖాన్, తాలిబ్ లను పోలీసులు చుట్టుముట్టారు. నిందితులు కొత్వాలి నాన్ పరా ప్రాంతం హండా బసేహరి కాలువ సమీపంలో పోలీసులకు తారసపడి కాల్పులకు పాల్పడగా, పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి నేపాల్ కేవలం 40 కిలోమీటర్ల దూరం మాత్రమే.
మరోవైపు అబ్దుల్ హమీద్ కుమారుడు కాల్పులకు పాల్పడుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ హత్య కేసులో మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్ల అనంతరం నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. నిందితులు నేపాల్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని కనిపెట్టాయి. ఈ రోజు ఉదయం వారి ఫోన్లు లొకేషన్ లోకి రాగానే పోలీసులు తమ చర్య ప్రారంభించారు.