కాంగ్రెస్​ మాజీ ఎంపీకి జీవిత ఖైదు

Ex-Congress MP sentenced to life imprisonment

Feb 25, 2025 - 15:03
 0
కాంగ్రెస్​ మాజీ ఎంపీకి జీవిత ఖైదు

సిక్కు అల్లర్ల కేసులో రౌస్​ అవెన్యూ కోర్టు తీర్పు
మరణశిక్ష విధించాలని కుటుంబ సభ్యుల డిమాండ్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్​ మాజీ ఎంపీ సజ్జన్​ కుమార్​ కు మంగళవారం రౌస్​ అవెన్యూ కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును ప్రకటించారు. ఈ తీర్పు సర్వతి విహార్​ లో జరిగిన అల్లర్ల సమయంలో జస్వంత్​ సింగ్​, అతని కుమారుడు తరుణ్​ దీప్​ సింగ్​ హత్యకు సంబంధించినది. అప్పట్లో సజ్జన్​ కుమార్​ ఢిల్లీ ఔటర్​ ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా బాధితుడి తరఫున కుటుంబ సభ్యులు మరణశిక్ష విధించాలని డిమాండ్​ చేశారు. ఈ కేసులో ఫిబ్రవరి 12న సజ్జన్​ కుమార్​ ను దోషిగా నిర్దరించింది. శిక్ష ఖరారు తేదీని వాయిదా వేసింది. అనంతరం 21న శిక్షపై నిర్ణయాన్ని కోర్టు రిజర్వ్​ చేసింది. తాజాగా జీవిత ఖైదు విధిస్తూ అంతిమ తీర్పు వెలువరించింది. ఇప్పటికే సజ్జన్​ కుమార్​ మరో కేసులో తీమార్​ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

మూడు కేసుల్లో రెండింటిలో దోషి..

ఢిల్లీ కాంట్‌లోని పాలం కాలనీలో ఐదుగురు సిక్కుల హత్య తర్వాత గురుద్వారాను దహనం చేశారు. ఈ కేసులో సజ్జన్ కుమార్ దోషిగా నిర్దరించారు. 2018 డిసెంబర్ 17న ఢిల్లీ హైకోర్టు అతనికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. సుల్తాన్​ పురిలో ముగ్గురు  సిక్కుల హత్య కేసులో 2023లో రౌస్​ అవెన్యూ కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. 1984 సరస్వతి విహార్​ ఇద్దరు సిక్కుల హత్య కేసులో తాజాగా దోషిగా నిర్దరించి జీవిత ఖైదు శిక్ష విధించింది. మొత్తం మూడింటిలో రెండు కేసుల్లో దోషిగా తేల్చింది. ఒక కేసులో ఆధారాలు, సాక్ష్యాలు లేనందున నిర్దోషిగా ప్రకటించింది.