భద్రతా వ్యూహాలు సమర్థవంతం
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భద్రత విధానాలను, వ్యూహాలను సమర్థవంతంగా రూపొందించే పనిలో నాణేనికి రెండు వైపులా ఆలోచించాల్సి ఉంటుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం న్యూ ఢిల్లీలో డీఆర్డీవో–ఎంహెచ్ ఎ సహకార సమావేశం, ఎగ్జిబిషన్ ను మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. అనంతరం సెమినార్ లో ప్రసంగించారు. దేశ అంతర్గత భద్రత, ఆధునాతన సాంకేతికతలపై పరస్పర సంబంధాలపై మాట్లాడారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, వామపక్ష తీవ్రవాదం, మతపరమైన ఉద్రిక్తతలు, సరిహద్దు సమస్యలు, అక్రమ వలసలు, వ్యవస్థీకృత నేరాలు వంటి ముప్పును ఎదుర్కొంటున్నా, వాటిని ఉక్కుపాదంతో అణిచివేసే విధంగా వ్యూహాలను రూపొందించామన్నారు. అదే సమయంలో హైబ్రిడ్ యుద్ధాలు, సైబర్ భద్రతా ముప్పు, బెదిరింపు కాల్స్, దేశ అంతర్గత వ్యవస్థలపై దాడులు వంటి వాటిని సమర్థవంతంగా అణచివేస్తామన్నారు. ఈ సమావేశం అత్యంత కీలకమైనదని చెప్పారు. డీఆర్డీవో సాంకేతికత వినియోగంతో దేశ భద్రతలో తలెత్తుతున్న సమస్యలను కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తామని మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.