రోడ్ టెర్రర్
2024లో 1.78 లక్షల మరణాలు

ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకుంటున్నా వాహనదారుల్లో మార్పు లేదు
అత్యధిక వేగం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించపోవడంతోనే అత్యధిక ప్రమాదాలు
18 నుంచి 34ఏళ్ల వారే 68 శాతం
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. రహదారుల్లో రక్తపుటేరులు పారుతున్నాయి. ప్రమాదాలకు కారణంగా మానవతప్పిదమేనని నిరూపితమవుతుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా వాహనదారుల్లో మీసమెత్తు మార్పు రాకపోవడం శోచనీయమని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాద మరణాల వల్ల లక్షలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ ప్రమాదాలకు కారణంగా ప్రభుత్వం, పోలీసులు అవగాహన కల్పిస్తున్నా వాహనదారుల నిర్లక్ష్యమేనని ఋజువవుతుంది. ఎన్ని చర్యలు తీసుకున్నా 2022, 2023 డేటాతో పోల్చుకుంటే 2024లో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య భారీగా పెరిగింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరించిన వివరాల ప్రకారం 2024లో 1.78 లక్షల మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.
కాగా రోడ్డు ప్రమాదాలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా పలుమార్లు ఆవేదన వ్యక్తం చేస్తూ 2030 వరకు ప్రమాదాలను 50 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అదే సమయంలో రోడ్డు ప్రమాదాల్లో గాయాలైన వారికి కేంద్ర ప్రభుత్వం రూ. 1.5 లక్షల వైద్యాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించింది. దీంతో గోల్డెన్ హవర్ లో వైద్యంతో నిండు ప్రాణాలను నిలిచే అవకాశం ఉంది.
రవాణా మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం..
భారతదేశంలో 10వేల కి.మీ.కు 250 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నాయి. ఈ సంఖ్య అమెరికాలో 57, చైనాలో 119, ఆస్ర్టేలియాలో 11 కంటే చాలా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. 2023లో దేశంలో 4.80 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాల్లో 1.72 లక్షల మంది మరణించారు. 2022తో పోలిస్తే 2.6 శాతం పెరుగుదల నమోదైంది. 2022లో 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.
కారణాలు..
రోడ్డు ప్రమాద మరణాల్లో ద్విచక్ర వాహనదారులు అధికంగా ఉన్నారు. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల 2023లో 54వేల మరణాలు సంభవించాయి. ఇక సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో 16వేలు, ఓర్ లోడింగ్ వల్ల 12వేలు, లైనెన్సులు లేని డ్రైవర్ల వల్ల 34వేల మరణాలు సంభవించాయి. అత్యధిక వేగం, వేగంపై నియంత్రణ కోల్పోవడంతో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. భారత్ లో సగటున రోజుకు 1,317 రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. 474 మంది మృత్యువాత పడుతున్నారు. ప్రతీ గంటకు 55 ప్రమాదాలు, 20 మరణాలు సంభవిస్తున్నాయి. 10వేల మంది మైనర్లు, 35 వేల మంది పాదచారులు కూడా ప్రమాదాల్లో మరణించారు. గుంతలు, సరైన అండర్పాస్లు లేకపోవడం, ఫుట్ ఓవర్బ్రిడ్జిలు, నిర్వహణ లేని రోడ్లపై అత్యధిక ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.
యూపీలో అత్యధికంగా 2023లో 44వేల ప్రమాదాల్లో 23,650 మంది మృతి చెందారు. వీరిలో అత్యధికంగా మైనర్లు, ద్విచక్రవాహనదారులే ఉన్నారు.
గ్లోబల్ న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్ ప్రకారం కార్లలో లోపాలు కూడా ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికుల మృతికి కారణం అవుతున్నాయి. ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకోకపోవడం, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్లు, సీట్ బెల్టుల్లో లోపాలు కూడా ఉన్నాయి.
సుప్రీంకోర్టు..
2014లో రోడ్డు ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ పలు సూచనలు సలహాలను చేసింది. మద్యం తాగి వాహనాలను నడపడాన్ని నియంత్రించడం, హెల్మెట్ లేకుండా నడపడం, పాఠశాలలు, ఇరుకు రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్, వేగాన్ని తగ్గించడం, హైవే రూడ్లపై మద్యం అమ్మకాలను నిషేధించడం, రోడ్డు భద్రతా చర్యలపై పాఠ్యాంశాల్లో చేర్చడం వంటి వాటిలో మెరుగైన ఫలితాలు సాధ్యపడుతుందని ప్రభుత్వానికి సూచించింది.
సుందర్ కమిటీ సిఫార్సులు..
భారతదేశంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి సుందర్ కమిటీ అనేక కీలక చర్యలను సిఫార్సు చేసింది. జాతీయ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిర్వహణ బోర్డు, పార్లమెంటరీ చట్టం ద్వారా జాతీయ స్థాయిలో ఒక అత్యున్నత సంస్థను ఏర్పాటు చేయడం, ఇందులో రోడ్డు ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ట్రాఫిక్ చట్టాలు, వైద్య సంరక్షణ రంగాల నిపుణులను చేర్చారు. ట్రాఫిక్ నిర్వహణపై స్థానిక అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లడం, ప్రమాదలను తగ్గించేందుకు లక్ష్యాలు, వ్యూహాలు, చర్యలతో కూడిన సమగ్ర ప్రణాళికను అభివృద్ధి చేయాలని సిఫార్సు చేసింది. అదే సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారికి గోల్డెన్ హవర్ లో చికిత్సనందించి ప్రాణాలు నిలిపేలా చర్యలు చేపట్టాలంది. అన్ని ప్రమాదాల డేటాబేస్, కారణాల నమోదు తప్పనిసి చేయాలని పేర్కొంది. డీజీల్, పెట్రోల్ పై వచ్చే 1శాతం పన్ను రోడ్డు భద్రతా నిధి కోసం కేటాయించాలని స్పష్టం చేసింది.
ఆయా సంవత్సరాల్లో మరణాలు..
2018లో 1,57,593
2019లో 1,58,984
2020లో 1,38,383
2021లో 1,53,972
2022లో 1,68,491
కారణాలు 2022 డేటా ప్రకారం మరణాలు..
అత్యధిక వేగం 1,19,904
మద్యం తాగడం 4,201
రాంగ్ సైడ్ డ్రైవింగ్ 9,094
సిగ్నల్ జంప్ 1,462
ఫోన్ డ్రైవింగ్ 3,395
ఇతర కారణాలు 30,435
కాగా ప్రమాదంలో అత్యధికంగా 18 నుంచి 34 ఏళ్ల వారే మృత్యువాత పడుతున్నారు. డేటా ప్రకారం 68 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. 2014లో 1,78వేల మరణాలు సంభవించాయి. యూపీలో 23,652, తమిళనాడులో 18,347, మహారాష్ర్టలో 15,366, మధ్యప్రదేశ్ లో 13,798మరణాలు నమోదయ్యాయి.