‘ఇండస్’ పై ఆందోళన వద్దు: ఆర్బీఐ
తగినంత మూలధనం ఉంది

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఇండస్ ఇండ్ బ్యాంక్ వద్ద తగినంత మూలధనం ఉందని, డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ ప్రకటించింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ లో అకౌంటింగ్ అవకతవకల వార్తల నేపథ్యంలో ఆ బ్యాంకు షేర్లు గత కొన్ని రోజులుగా భారీగా దిగజారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ శనివారం ప్రకటన విడుదల చేసింది. బ్యాంకు ఆర్థికంగా స్థిరంగా ఉందని పేర్కొంది. ఇప్పటికే ఆర్థిక ఫలితాలను ఆడిటర్ సమీక్షించారని పేర్కొంది. మూలధనం ఉందని, నిష్పత్తి 15.46 శాతం ఉందని, ప్రొవిజన్ నిష్పత్తి 70.20 శాతంగా ఉందని, 2025 మార్చి 9 నాటికి లిక్విడిటీ కవరేజ్ నిష్పత్తి 113 శాతంగా ఉందని ఆర్బీఐ పేర్కొంది. ఇండస్ ఇండ్ బ్యాంకు కూడా ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రత్యేక ఆడిటింగ్ బృందాన్ని నియమించి నివేదికను ఆర్బీఐకి సమర్పించింది. ఆరోపణల నేపథ్యంలో మంగళవారం బ్యాంకు షేర్లు 27.06 శాతం తగ్గాయి. మార్కెట్ క్యాప్ 2.35 శాతం తగ్గింది. ఆ రోజు నుంచి రోజూ స్వల్పంగా బ్యాంకు షేర్లకు నష్టం వాటిల్లుతుంది. దీంతో పెట్టుబడిదారులు కూడా పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని అంతటినీ సమీక్షించిన ఆర్బీఐ ప్రకటన ఇండస్ ఇండ్ బ్యాంకు ఖాతాదారులకు, పెట్టుబడిదారులకు భరోసా కల్పించినట్లయ్యింది.