మోస్ట్ వాంటెడ్ ఖతల్ ఖతం!
Most Wanted is finished!

సయీద్ ముఖ్య అనుచరుడు
జమ్మూకశ్మీర్ దాడుల్లో మాస్టర్ మైండ్
పలు కేసుల్లో ఎన్ ఐఎ చార్జీషీట్ దాఖలు
ఇస్లామాబాద్: భారత్ లో పలుదాడుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న పాక్ లష్కరే తోయిబా ఉగ్రవాది, హఫీజ్ సయీద్ కు సన్నిహితుడు అబూ ఖతల్ (జియా ఉర్ రెహ్మాన్) హతమయ్యాడు. అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం అర్థరాత్రి కాల్పులకు పాల్పడగా అక్కడికక్కడే మృతి చెందాడు. హఫీజ్ సయీద్ మరణించాడని తొలుత అంతా భావించారు. తరువాత మృతి చెందింది ఖతల్ గా నిర్దరించారు. పంజాబ్ విశ్వవిద్యాలయం సమీపంలో అతని కాన్వాయ్ వెళుతుండగా గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఖతల్ తోపాటు ఒక గార్డు మృతి చెందాడు. మరో గార్డుకు తీవ్రగాయాలయ్యాయి. అతనిపై కాల్పులు జరుపుతున్నప్పుడు అతని చుట్టూ 20 మంది వరకు పాక్ ఆర్మీకి చెందిన సైనికులు ఉన్నారు. దాడి జరుగుతున్నప్పుడు వారు కూడా అతన్ని కాపాడలేకపోయారు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేరుపొందిన వారికి పాక్ ఆశ్రయం ఇవ్వడం, భద్రత కల్పించడం నిజమేనని దీంతో మరోమారు నిరూపితం అవుతుంది.
కాగా జమ్మూకశ్మీర్ లో జరిగిన అనేక దాడుల్లో ఇతని హస్తం ఉంది. హఫీజ్ సయీద్ ఆదేశాలతో ఇతను ప్రణాళికలు రూపొందించేవాడు. దాడులకు ఉగ్రవాదులను ఉసిగొలిపేవాడు. ఎన్ ఐఎ లిస్టులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. 26/11 ముంబాయి ఉగ్రదాడిలో కూడా ఇతని హస్తం ఉన్నట్లు ఇంటలిజెన్స్ పేర్కొంది. గతేడాది జూన్ 9న రియాసీ శివఖోడి ఆలయం యాత్రికుల బస్సుపై దాడి, 2023 రాజౌరి దాడి, ఇలా అనేక దాడులకు ఇతనే మాస్టర్ మైండ్ గా వ్యవహరించినట్లు ఎన్ ఐఎ గుర్తించింది. ఆయా కేసుల్లో ఇతనిపై ఎన్ ఐఎ చార్జీషీట్ కూడా దాఖలు చేసింది. కాగా 2023లో ఖతల్ కు అత్యంత దగ్గరివారైన రియాజ్ అహ్మద్, అద్నాన్ అనే ఉగ్రవాదులు కూడా గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు.