పుణ్య స్నానాలు @55 కోట్లు!
Holy Baths @55 Crores!

లక్నో: దేశంలోని 45 శాతం మంది భక్తులు ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో ఇప్పటికే పుణ్య స్నానాలు ఆచరించారని లెక్కలు చెబుతున్నాయని అధికారులు చెప్పారు. సోమవారం వరకు 55 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని అన్నారు. ఈ లెక్కన చూస్తే మరో వారం రోజుల్లో ఈ సంఖ్య 60 కోట్లకు పైగా చేరుకుంటుందని అన్నారు. చివరి రోజులు కావడంతో భారీగా భక్తులు పుణ్య స్నానాలకు పోటెత్తుతున్నారని తెలిపారు. మరోవైపు ప్రయాగ్ రాజ్ కు వచ్చే రైళ్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 12 గంటలపాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికీ 10 కిలోమీటర్ల ముందే వాహనాలను నిలిపివేసే చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు కుంభమేళాకు దారితీసే ఎనిమిది దారుల్లోనూ 25 కి.మీ. మేర భారీ ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్డాయి. పోలీసులు, అధికారులు, సైన్యం అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచంలోనే ఇంతపెద్ద ఎత్తున భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిన ఉదాహరణలు ఎక్కడా లేవు.
మహాకుంభమేళా ద్వారా గొప్ప సందేశం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
మరోవైపు మంగళవారం ప్రముఖులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీసమేతంగా పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భారత్ భిన్నత్వంలో ఏకత్వం అన్నారు. వర్గాలు, వర్ణాలు వేరైనప్పటికీ మనమంతా ఒక్కటే అనే గొప్ప సందేశాన్ని మహాకుంభమేళా అందిస్తుందన్నారు. ఇంతగొప్ప అవకాశం తనకు కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. మాజీ ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు పుణ్య స్నానం ఆచరించారు.