ఐదు రాష్ట్రాలకు విపత్తు సాయం రూ. 1,554.99 కోట్లు
Disaster relief to five states Rs. 1,554.99 crores

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఐదురాష్ట్రాలకు రూ. 1,554.99 కోట్ల విపత్తు సహాయాన్ని కేంద్రం ఆమోదించింది. ఫెంగల్ తుఫాను కారణంగా నష్టపోయిన రాష్ట్రాలకు ఈ ఆర్థిక సహాయం అందజేసింది. బుధవారం ఉదయం న్యూ ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షత జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు రూ. 608.08 కోట్లు, నాగాలాండ్ కు రూ. 170.99 కోట్లు, ఒడిశాకు రూ. 255.24 కోట్లు, తెలంగాణకు రూ. 231.75 కోట్లు, త్రిపురకు రూ. 288.93 కోట్ల నిధులున్నాయి. ఈ నిధులను ఎన్డీఆర్ ఎఫ్ రాష్ట్రాలకు అందించనుంది. ఎస్డీఆర్ఎఫ్ ద్వారా రాష్ట్రాలకు కేటాయించిన నిధులు అదనంగా ఉన్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎస్డీఆర్ఎఫ్ కింద 27 రాష్ట్రాలకు రూ. 18,322.80 కోట్ల నిధులను కేంద్రం అందజేసింది. ఇదే సమయంలో ఎన్డీఆర్ఎఫ్ నిధులు 18 రాష్ట్రాలకు 4,808.30 కోట్లు అందాయి. దీంతోపాటు రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి (ఎస్డీఎంఎఫ్) నుంచి 14 రాష్ర్టాలకు రూ. 2,208.55 కోట్లు, జాతీయ విపత్తు ఉపశమన నిధి నుంచి ఎనిమిది రాష్ట్రాలకు రూ. 719.72 కోట్ల నిధులను కేటాయించారు. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో బాధితులకు శీఘ్ర ఆర్థిక సహాయం అందేలా వివిధ విభాగాల ద్వారా కేంద్రం ఎప్పటికప్పుడు నిధులను కేటాయిస్తుంది. ఆయా ఆర్థిక సంవత్సరాల్లో ఉపద్రవాలు చోటు చేసుకోకముందే నిధులను సిద్ధం చేస్తుంది. ఆయా విభాగాలకు అందజేస్తుంది. నష్టం అనంతరం నష్ట నివారణ బృందాల ద్వారా అందే నివేదిక ప్రకారం మరిన్ని నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది.