2027లో చంద్రయాన్–4
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్

2026లో గగన్ యాన్
2035లో భారత అంతరిక్ష కేంద్రం
2040లో చంద్రుడిపైకి భారతీయుడు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ చంద్రయాన్–4 మిషన్ ను 2027లో చేపట్టనున్నట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. గురువారం ఆయన చంద్రయాన్–4 మిషన్ గురించిన సమాచారాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ మిషన్ భారత్ కు అత్యంత కీలకమైందన్నారు. ఈ మిషన్ ద్వారా చంద్రుడిపై ఉన్న పలు రకాల అవశేషాలను భూమిపైకి తీసుకువస్తామని తెలిపారు. ఎల్ వీఎం –3 ద్వారా ప్రయోగిస్తామని తెలిపారు. గగన్ యాన్ మిషన్ లో భారత వ్యోమగాములను అంతరిక్ష నౌకలో భూమి దిగువ కక్ష్య (సముద్రంలోకి)కు పంపించి సురక్షితంగా తిరిగి తీసుకువస్తామని తెలిపారు. ఈ మిషన్ 2026లో చేపడతామన్నారు. గత సంవత్సరం చంద్రయాన్–4 మిషన్ ను ప్రధాని మోదీ మంత్రివర్గం ఆమోదించిందన్నారు. ఈ మిషన్ ను 36 నెలల్లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ మిషన్ కోసం రూ. 2104.06 కోట్లను అందించామన్నారు. చంద్రయాన్ 4 రెండు దఫాల ప్రయోగం చేపడతామన్నారు. మాడ్యూల్, డాకింగ్ లాంటి ప్రక్రియలు ఇందులో ఉంటాయన్నారు. 2035లో భారత అంతరిక్ష కేంద్రం, 2040లో చంద్రుడిపైకి భారతీయుడిని పంపాలని భావిస్తున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.