ఎఎంయూ నోటీసు బోర్డులో బీఫ్ బిర్యానీ!
మండిపడ్డ బీజేపీ నాయకుడు నిషికాంత్ శర్మ

సీనియర్ విద్యార్థుల తప్పిదమేనన్న అధికారులు
లక్నో: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఎఎంయూ)లో చికెన్ కు బదులు బీఫ్ బిర్యానీ వడ్డిస్తామన్న నోటీసుపై పలు విద్యార్థి సంఘాలు, బీజేపీ నాయకుడు నిషికాంత్ శర్మ తీవ్రంగా మండిపడ్డారు. సర్ సులేమాన్ షా హాల్ లో నోటీసు బోర్డుపై ఆదివారం బీఫ్ బిర్యానీ మెనును వడ్డిస్తామని పేర్కొన్నారు. ఈ నోటీసును బోర్డులో ప్రదర్శించే అధికారం యూనివర్సిటీకి చెందిన ఇద్దరు అధికారులపై ఉంది. దీంతో విద్యార్థులు ఈ నోటీసును క్షణాల్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. వివాదాస్పద నోటీసుపై బీజేపీ నాయకుడు నిషికాంత్ శర్మ మండిపడ్డారు. నోటీసు బోర్డులో బీఫ్ బిర్యానీ వడ్డిస్తామనడం సిగ్గు చేటన్నారు. దీనికి యూనివర్సిటీ కమిటీ బాధ్యత చేపట్టాలన్నారు. పరిపాలనా యంత్రాంగం ఇప్పటికీ చూసుకుంటూ కూర్చొంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
కాగా బీఫ్ బిర్యానీ నోటీసుపై మీడియా అధికారులను ప్రశ్నించింది. చికెన్ బిర్యానీ బదులు, బీఫ్ బిర్యానీ అని తప్పుగా అచ్చయినట్లు వెల్లడించారు. ఇది తెలిసి వెంటనే నోటీసు బోర్డు పై నుంచి తీసివేశామన్నారు. తప్పిదానికి చింతిస్తున్నట్లు ప్రకటించారు. కాగా నోటీసులో ఏ అధికారి సంతకం లేనట్లు గుర్తించామన్నారు. అంతేగాక ఈ నోటీసుల జారీలో ఇద్దరు సీనియర్ విద్యార్థుల పాత్ర ఉన్నట్లు గ్రహించి వారికి నోటీసులు జారీ చేశామన్నారు.