అక్రమ వలసలపై చర్యలేవి?
అసోం ప్రభుత్వానికి సుప్రీం మొట్టికాయలు

డీస్పూర్: భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన విదేశీయులపై చర్యలు తీసుకోకుండా అసోం ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుందని సుప్రీంకోర్టు మందలించింది. నిర్బంధించిన 63 మంది నిర్బంధ కేంద్రాల్లో ఎందుకు ఉంచారని ప్రశ్నించింది. వారిని రెండు వారాల్లోగా వారి వారి స్వస్థలాలకు వెళ్లే ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. మంగళవారం అక్రమ వలసవాదుల పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ఒకవేళ చిరునామాలు లేకుంటే వారు ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశాలకు తరలించాలని స్పష్టం చేసింది. బహిష్కరించకపోవడానికి చిరునామాయే కారణమా? అని నిలదీసింది. ఈ ప్రతిపాదనను విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఎందుకు పంపలేదని ప్రశ్నించింది. ప్రతీ ఒక్కరికి ఆర్టికల్ 21 ప్రకారం జీవించే ప్రాథమిక హక్కు వర్తిస్తుందని పేర్కొంది. అక్రమంగా వలసవచ్చిన వారిని గుర్తించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని తెలిపింది. ఈ కమిటీ శిబిరాలు, నిర్బంధ కేంద్రాలను వారానికి ఒకసారి సందర్శించి అక్కడి మౌలిక సదుపాయాలపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అసోం ప్రభుత్వం నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని, ఏ దేశస్థులో తెలియని వారి సమస్యను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో నాలుగు వారాల్లోగా వివరించాలని అసోం ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.