సైబర్ నేరాలపై ఉక్కుపాదం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారతదేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన సైబర్ భద్రత, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బుధవారం పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశం ద్వారా మోదీ ప్రభుత్వం సైబర్ నేరాలు, సమన్వయం, కమ్యూనికేషన్, సామర్థ్య నిర్మాణం ద్వారా సురక్షితమైన సైబర్స్పేస్ను నిర్మిస్తోందని తెలిపారు. అలాంటి ఖాతాలను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతికత ఎఐని ఉపయోగించాలని సమావేశంలో అధికారులకు సూచించారు. 1930 నెంబర్ ద్వారా అందిన ఫిర్యాదుల మేరకు ఇప్పటివరకు 805 యాప్ లు, 3,266 వెబ్ సైట్ లు బ్లాక్ చేశామన్నారు. 14 సీ పోర్టల్ లో 1.43 లక్షల ఎఫ్ ఐఆర్ లు నమోదు చేసినట్లు వివరించారు. సైబర్ క్రైమ్ వెబ్ సైట్ ను ఇప్పటికే 19 కోట్ల మంది ప్రజలు యాక్సెస్ చేసుకున్నారని తెలిపారు. అదనంగా మరో 19 లక్షల అనుమానాస్పద ఖాతాలను గుర్తించామన్నారు. ఈ ఖాతాల ద్వారా రూ 2,038 కోట్ల అనుమానాస్పద లావాదేవీలను నిరోధించామన్నారు. గతదశాబ్ధ కాలంలో భారత్ డిజిటల్ విప్లవం చూసిందన్నారు. మౌలిక సదుపాయాల వేగవంతం కావడానికి కీలకభూమిక పోషించిందని చెప్పారు. సైబర్ నేరాలకు భౌగోళిక సరిహద్దులు లేవని గుర్తుంచుకోవాలని అమిత్ షా చెప్పారు. 2024లో యూపీఐ ద్వారా రూ. 17.221 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయన్నారు. ఇది ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో 48 శాతం భారత్ లోనే జరిగాయన్నారు.