బీజాపూర్ లో ఎన్ కౌంటర్ 31 మంది నక్సల్స్, ఇద్దరు జవాన్లు మృతి
కొనసాగుతున్న కూంబింగ్

కొనసాగుతున్న కూంబింగ్
రాయ్ పూర్: చత్తీస్ గఢ్ బీజాపూర్ లో నక్సల్స్ కు మరోమారు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం వేకువజాము నుంచి కొనసాగుతున్న ఎన్ కౌంటర్ లో 31 మంది నక్సలైట్లను భద్రతదళాలు మట్టుబెట్టాయి. కూంబింగ్ కొనసాగుతుండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నేషనల్ పార్క్ అడవుల్లో భద్రతాదళాలు కూంబింగ్ చేస్తుండగా నక్సల్స్ కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురుకాల్పుల్లో భారీ ఎత్తున నక్సలైట్లు హతమయ్యారు. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని బీజాపూర్ లోని నారాయణ్ పూర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు జవాన్లు మృతి చెందారు. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ నారాయణ్ పూర్ ఆనుకుని ఉన్న మహారాష్ర్ట సరిహద్దు ఇంద్రావతీ జాతీయ ఉద్యానవనం అడవి ప్రాంతాల్లో జరిగింది. ఎన్ కౌంటర్ స్థలం నుంచి భారీ ఎత్తున ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్, ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఈ ఆపరేషన్ లో వెయ్యిమంది భద్రతా దళాలు పాల్గొన్నట్లు సమాచారం. మరింతమంది నక్సల్స్ మృతి చెందే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతుండడంతో పూర్తి వివరాలు అందజేసేందుకు ఇంకా సమయం పట్టవచ్చని అధికారులు తెలిపారు.