యమునా శుద్ధి పనులు మొదలు
Yamuna purification work started

ఎల్జీ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
భారీ యంత్రాలతో రంగంలోకి
నాలుగుదశల వ్యూహం సిద్ధం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని యమునా నది శుద్ధికి నడుం బిగించారు. ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో ఎల్జీ వీకే సక్సేనా భేటీ అయ్యారు. చెత్తను తొలగించే పనిలో వేగం పెంచాలన్నారు. ఆయన ఆదేశాల మేరకు వెంటనే భారీ చెత్తస్కిమ్మర్లు, కలుపు తీసే యంత్రాలు, డ్రెడ్జ్ యూటిలిటీ క్రాఫ్ట్ వంటి యంత్రాలను రంగంలోకి దింపి శుద్ధి పనికి నాందీ పలికారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యమునా నదిని శుభ్రం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా యమునా నది ప్రక్షాళన అనేది బీజేపీ పెద్ద సవాల్ లా మారిన ధైర్యంగా ముందడుగు వేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏన్నోఏళ్ల నుంచి పేరుకుపోయిన చెత్తా చెదారం, కలుపు మొక్కలు, రసాయనాలను ఓ వైపు తొలగిస్తూనే మరోవైపు ఇవన్నీ మరోమారు నదిలో చేరకుండా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. యమునాను శుభపరిచేందుకు నాలుగు వ్యూహాలను అధికారులు సిద్ధం చేశారు.
– మొదటి వ్యూహంలో యమునా నది నుంచి చెత్త, శిథిలాలు, బురదను తొలగిస్తారు.
– రెండో దశలో నజాఫ్గఢ్ డ్రెయిన్, సప్లిమెంటరీ డ్రెయిన్, ఇతర ప్రధాన డ్రెయిన్లను శుభ్రపరిచే పనులు ప్రారంభిస్తారు.
– మూడో దశలో మురుగునీటి శుద్ధి కర్మాగారాలు (ఎస్టీపీ) సామర్థ్యం, ఉత్పత్తిని రోజువారీగా క్రమం తప్పక పర్యవేక్షిస్తూ ప్రాంతాల వారీగా వివరాలను నమోదు చేస్తారు.
– నాలుగో దశలో 400 ఎంజీడీ వ్యర్థ జలాల వాస్తవ కొరతను తీర్చడానికి కొత్త ఎస్టపీలు, డీఎస్ టీపీల నిర్మానానికి కాలపరిమితితో కూడిన ప్రణాళికను రూపొందించి అమలు చేస్తారు.
ఈ నాలుగు దశల్లో ఢిల్లీ జల్ బోర్డుతో సహా అన్ని సంస్థలు సంయుక్తంగా పనిచేసేందుకు ఒక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. డీజేబీ, ఐఅండ్ఎఫ్ సీ,ఎంసీడీ, పర్యావరణ, పీడబ్ల్యూ డీ, డీడీఎ సంస్థల పనితీరును ఉన్నతస్థాయిలో పర్యవేక్షించనున్నారు.