నీట్ పై సిఫార్సులను అమలు చేస్తాం
సుప్రీంకు వాదనలు వినిపించిన కేంద్రం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నీట్ యూజీ పరీక్షలపై నిపుణుల కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. పరీక్ష మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్ పై గురువారం సుప్రీం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది తుషార్ మెహతా సుప్రీంకు తమ వాదనలు వినిపించారు. పేపర్ లీక్ కు ఆధారాలు లభించలేదన్నారు. ప్రభుత్వం ఏడుగురితో కలిసి ఏర్పాటు చేసిన కమిటీ తన సూచనలు, సలహాలు అందజేయాల్సి ఉందన్నారు. ఈ కమిటీకి ఇస్రో మాజీ చీఫ్ కె. రాధాకృష్ణన్ నేతృత్వం వహిస్తున్నారు. కమిటీలోని ఇతర సభ్యులలో రణదీప్ గులేరియా, బిజె రావు, రామమూర్తి కె, పంకజ్ బన్సాల్, ఆదిత్య మిట్టల్, గోవింద్ జైస్వాల్ కూడా ఉన్నారు. తాము కమిటీ చేసిన అన్ని సిఫార్సులను అమలు చేస్తామన్నారు. ఇందుకు మరో ఆరు నెలల సమయం పట్టవచ్చన్నారు. ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం కేసును మూడు నెలలపాటు వాయిదా వేసింది.