వక్ఫ్ బోర్డు ఉన్నట్లే సనాతన బోర్డు ఉండాల్సిందే
ఆధ్యాత్మిక వేత్త దేవకీనందన్ ఠాకూర్

బెంగళూరు: దేశంలో వక్ఫ్ బోర్డు ఉన్నప్పుడు సనాతన బోర్డు ఎందుకు ఎండకూడదని ఆధ్యాత్మిక వేత్త దేవకీనందన్ ఠాకూర్ ప్రశ్నించారు. ఈ విషయంలో అన్ని రాష్ర్ట ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని శంకరాచార్య అధ్యక్షతన సనాతన బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం బెంగళూరు ఆలయ సమావేశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని దేవకీనందన్ ప్రసంగించారు. ఆలయాలను ప్రభుత్వాల నియంత్రణ నుంచి పూర్తిగా విముక్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతి ఆలయం నుంచి ప్రతీయేటా రాష్ర్ట ప్రభుత్వానికి రూ. 500 కోట్లు సమకూరుతుందన్నారు. ఈ మొత్తం దేనికి వినియోగిస్తున్నారని ప్రశ్నించారు. ఆలయాల్లో సమకూరిన డబ్బుతో మతమార్పిళ్లు జరుగుతున్నాయని అనుమానాన్ని వ్యక్తం చేశారు. సనాతన బోర్డు త్వరలో ఏర్పాటు చేయకుంటే సంభాల్ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. దేవాలయాలను రక్షించుకోవడానికి భక్తులు పూలమాలలతోపాటు ఈటెలను కూడా పట్టుకోవాల్సిన పరిస్థితులను ప్రభుత్వాలు కల్పించొదన్నారు. హిందువులపై, దేవాలయాలపై దాడులను ఇక సహించబోమని తమ హక్కులను తామే కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని దేవకీనందన్ ఠాకూర్ అన్నారు.