సైనికుల త్యాగం వెలకట్టలేనిది
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

మార్సెయిల్ లో భారత రాయబార కార్యాలయం ప్రారంభం
పారిస్: రెండు ప్రపంచయుద్ధాల్లో ఎంతోమంది సైనికులు అసువులు బాసారని, వారి సేవలు, పోరాట స్ఫూర్తి వెలకట్టలేనిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో కలిసి మార్సెయిల్లేలోని భారత రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అమరులైన భారత, ఫ్రాన్స్ సైనికులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున వచ్చిన ప్రవాస భారతీయులతో కరచాలనం చేశారు. ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన డప్పు వాయిద్యాల స్వాగతాన్ని స్వీకరించారు. ప్రధాని మోదీతో కరచాలనం చేసేందుకు ప్రవాస భారతీయులు పోటీ పడ్డారు. అనంతరం ప్రవాస భారతీయులతో భేటీ అయి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన వివరాలను ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పంచుకుంటూ భారత్–ఫ్రాన్స్ ప్రజల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని, ఇరుదేశాల అభివృద్ధి మరింత జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ నేరుగా అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు.