దివాళా దిశలో పాక్
భారత్తో దోస్తీకి కొత్త సర్కారు ప్రయత్నం షరీఫ్ మంత్రివర్గంలో సమాలోచనలు ఉగ్రవాదం వదలందే దోస్తీ ఎలా: భారత్

నా తెలంగాణ, న్యూఢిల్లీ: భారత్తో వాణిజ్య, వ్యాపారాలను తిరిగి ప్రారంభించాలని పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోయి పాక్ ఆర్థిక వ్యవస్థ దివాళా దిశలో నడుస్తున్న సంగతి తెలిసిందే. 2019లో భారత్లో వాణిజ్య, వ్యాపార సంబంధాలను పాక్ తెగదెంపులు చేసుకుంది. ప్రస్తుతం ఎలాగైనా భారత్తో చేతులు కలపాలని భావిస్తోంది. ఈ విషయాల్లో పాక్మంత్రివర్గం తీవ్ర సమాలోచనల్లో ఉందని పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఇషాక్ దార్ చెప్పారు. బ్రస్సెల్స్లో జరిగే అణుశక్తి సదస్సులో పాల్గొనేందుకు లండన్ చేరుకున్న ఆయన, అక్కడ భారత్ తో సంబంధాలపై మాట్లాడటం విశేషం. జమ్మూకశ్మీర్ విషయంలో మాటిమాటికి తలదూర్చడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, సైనికులు, ప్రజలపై దాడులు, ఆర్టికల్ 370 రద్దు తదితర పరిణామాల నేపథ్యంలో పాక్భారత్తో దౌత్యసంబంధాలను తగ్గించామని పాక్ మంత్రి పేర్కొన్నారు.
పాక్ పొరుగు దేశం దురదృష్టకరం.. జై శంకర్
ఇదే విషయంపై శనివారం భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ సింగపూర్ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్తన పొరుగు దేశంతో సత్సంబంధాలను కోరుకుంటున్నదని, కానీ ఉగ్రదేశంగా ముద్రపడ్డా కూడా పాక్ ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. భారత్కు పాకిస్తాన్ పొరుగుదేశం కావడం దురదృష్టకరమన్నారు. ఉగ్రవాదాన్ని ఉపయోగించుకుంటూ.. ముందు ఒకలా, వెనక మరోలా వ్యవహరిస్తున్న దేశంతో ఇక చర్చలు కొనసాగిద్దాం అని భారత్ ఎన్నటికీ అనబోధని జై శంకర్ స్పష్టం చేశారు.
షరీఫ్కు మోదీ అభినందనలు, మోదీకి ధన్యవాదాలు..
పాక్లో ఇటీవలే నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. షరీఫ్ ఎన్నికపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. దీనికి ప్రతిగా షరీఫ్ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థతో భారత్తో కలిసి దౌత్యసంబంధాలను మెరుగు పరుచుకోవాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
చైనాతో దోస్తీ.. పాక్పై వ్యతిరేకత..
ఓవైపు పాక్లో చైనా చేపట్టిన పలు పనులకు బలూచ్ ఉగ్రవాదులు తీవ్ర ఆటంకాలు కల్పిస్తున్నారు. తాలిబన్లు కూడా పాక్ చర్యలపై గుర్రుగానే ఉన్నారు. మరోవైపు వ్యవసాయ ఉత్పత్తులు పూర్తిగా భారత్ వైపు నుంచి నిలిచిపోవడంతో క్రమేణా పాక్లో సంక్షోభ పరిస్థితులు తీవ్రతరమయ్యాయి. అయినా పాక్ తన పెడధోరణిని విడనాడక, మొండిపట్టుతో భారత్ను సాధించాలని చైనాకు స్నేహ హస్తం అందిస్తూ మరింత అగాధంలోకి కూరుకుపోతోంది. ఇటీవల ఏర్పడ్డ షరీఫ్ ప్రభుత్వం ఆయా విషయాలను తన మంత్రివర్గంలో కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రపంచ దేసాలు వేచి చూస్తున్నాయి.