జీవితాంతం తీహార్ లోనే కేజ్రీవాల్
ఢిల్లీ మంత్రి ప్రవేశ్ వర్మ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇక జీవితాంతం తీహార్ జైలులోనే ఉంటాడని, బయటకు రాడని మంత్రి ప్రవేశ్ వర్మ విమర్శించారు. శుక్రవారం ప్రవేశ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ అవినీతిని ఎండగట్టారు. ఇక కుంభకోణాలన్నింటిపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. జనం నుంచి దోచుకున్న అవినీతి సొమ్మును కక్కించే వరకు వదిలేది లేదని హెచ్చరించారు. ఢిల్లీని మోదీ నేతృత్వంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతామని ఘంటాపథంగా చెప్పారు. గత ప్రభుత్వం లండన్ లా రూపొందిస్తామని ఏమీ చేయలేదని విమర్శించారు. పాఠశాలలు, దేవాలయాల వద్దే మద్యం షాపులు తెరిచిందని మండిపడ్డారు. ప్రజల మేలు కోరాల్సిన ప్రభుత్వం కాస్త తమ విలాసాలకే పరిమితమై వందల కోట్ల రూపాయలతో శీష్ మహల్ ను నిర్మించుకుందని, అదంతా అవినీతి సొమ్మేనని అన్నారు. ఓట్లు రాబట్టుకొనేందుకు తల్లిదండ్రులను సైతం వినియోగించుకున్నారని విమర్శించారు. కులాల ఆధారంగా ఢిల్లీని విడదీయాలని ప్రయత్నించి విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఆక్రమణదారులు భారతీయ సంస్కృతిపై దాడి చేసేలా పేర్లు మార్చిన ప్రాంతాల పేర్లన్నింటినీ మార్చి తీరుతామని చెప్పారు. అక్రమ వలసదారుల నెట్ వర్క్ ను పూర్తిగా విచ్ఛిన్నం చేసే వరకు నిద్రపోబోమని ప్రవేశ్ వర్మ స్పష్టం చేశారు.