అంబరాన్నంటిన హోళీ సంబురాలు

Holi celebrations around Ambarannanthi

Mar 14, 2025 - 12:38
 0
అంబరాన్నంటిన హోళీ సంబురాలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా హోళీ సంబురాలు అంబరాన్నంటాయి. రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్​ షా, జేపీ నడ్డా, రాజ్​ నాథ్​ సింగ్​, జి.కిషన్​ రెడ్డి తదితరులు ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. హోళీ దుష్​టశక్తి అంతానికి చిహ్నామన్నారు. సత్యానికి, విజయానికి సంకేతమన్నారు. పరస్పర సోదరభావంతో, సామరస్యంగా పండుగను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. 

మరోవైపు దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద హోళీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రంజాన్​ శుక్రవారం కూడా ఉండడంతో పోలీసులు దేశంలోని ఆయాచోట్ల అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్​, ఉత్తరప్రదేశ్​, మహారాష్ర్ట, ఢిల్లీ సహా ప్రముఖ రాష్ర్టాల్లో ఉన్న మసీదుల వద్ద భారీ బందోబస్తు కోసం ఆర్మీ, డ్రోన్​ కెమెరాలను వినియోగిస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​, రాజస్థాన్​ ముఖ్యమంత్రి భజన్​ లాల్​ శర్మ, మధ్యప్రదేశ్​ సీఎం మోహన్​ యాదవ్​, ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్​ సింగ్​ ధామీ, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం రేఖాగుప్తా, ప్రవేశ్​ వర్మలు హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. జేపీ నడ్డా తన నివాసంలో వేడుకలు నిర్వహించారు. 

అయోధ్య, మధ్యప్రదేశ్​ ఉజ్జయిని, ఒడిశాలోని పూరి, యూపీలోని మధుర, బృందావన్​ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి హోళీ వేడుకలు నిర్వహించారు. అయోధ్యలో శ్రీరాముడు విల్లుకు బదులుగా రంగులు చల్లె పిచికారీని చేతబూనాడు. ఉజ్జయినీలో మహాకాళుడికి ప్రత్యేక పూజలు, హారతులకు ముందు గులాల్​ తో అలంకరించారు. ఆ పై మహాహారతి ఇచ్చారు. టీఎంసీ కంచుకోట పశ్చిమ బెంగాల్​ లోనూ మహిళలు రోడ్లపైకి వచ్చి, ఆలయాల వద్ద హోళీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఒడిశా పూరిలో ప్రముఖ ఇసుక చిత్రకారుడు సుదర్శన్​ పట్నాయక్​ రాధాకృష్ణ చిత్రాలను రూపొందించి దేశ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. గోరఖ్​ పూర్​ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ ప్రాంగణంలోని గోమాతతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ హోళీ వేడుకలను ప్రారంభించారు. యూపీలోని వారణాసి, అజ్మీర్​ లలో విదేశీయులు సైతం హోళీ వేడుకల్లో పాల్గొని భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక త్రిపురలో బీఎస్​ ఎఫ్​ జవాన్లు డ్యాన్సులతో హోరెత్తిస్తూ పర్వదినాన్ని కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. తమిళనాడులోని ప్రముఖ ఆలయాల వద్ద భక్తులు భగవంతుని దర్శనం కోసం బారులు తీరారు. దర్శనాలు, ప్రత్యేక పూజల అనంతరం హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. అసోం దిబ్రూఘర్​, ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, కేరళ, పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే ఆలయాల వద్ద భక్తుల కోలాహలం,సందడి నెలకొంది. అనంతరం హోళీ వేడుకల్లో పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.