విశ్వాసాన్ని ఆర్థికంతో ముడిపెట్టొద్దు
ప్రతిపక్షాలపై యూపీ సీఎం యోగి ఫైర్

లక్నో: మహాకుంభమేళా విశ్వాసాన్ని ఆర్థిక వ్యవస్థతో ముడిపెట్టవద్దని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి విపక్షాల తీరుపై విరుచుకుపడ్డారు. నమ్మకం, విశ్వాసం, భక్తికి సంబంధించిన అంశాలన్నారు. మంగళవారం అసెంబ్లీలో మహాకుంభ్ మేళా విజయవంతంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మేళా నిర్వహణ వల్ల అయోధ్యతోపాటు, కాశీ లాంటి పవిత్ర క్షేత్రాలకు కూడా ప్రయోజనం చేకూరిందన్నారు. ప్రతిపక్షాలు మేళా నిర్వహిస్తున్నంత సమయం భక్తి విశ్వాసంపై అసత్యాలను వ్యాప్తి చేశారని మండిపడ్డారు. కుంభమేళాకు పలువురు నాయకులు సందర్శించకపోవడాన్ని వేలెత్తి చూపారు. త్వరలోనే దేశ ప్రజలు విపక్షాలు, దేశ వ్యతిరేకుల మాటలను వినడం పూర్తిగా మానేస్తారని అన్నారు. తమ ప్రభుత్వం రైతుల మేలు కోరే ప్రభుత్వమని చెప్పారు. ఈ బడ్జెట్ లో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇచ్చేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రాష్ర్ట సర్వతోముఖాభివృద్ధియే తమ లక్ష్యమని యూపీ సీఎం యోగి పునరుద్ఘాటించారు.