2025–26 బడ్జెట్–1
Budget 2025–26–1

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ప్రసంగాన్ని వినిపించారు. ఆమె మాట్లాడుతూ.. వృద్ధిని వేగవంతం చేయడం, సురక్షితమైన సమ్మిళిత వృద్ధి, ప్రైవేట్ రంగ పెట్టుబడిని ప్రోత్సహించడం, గృహ వ్యయాన్ని పెంచడం, భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి ఖర్చు శక్తిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అభివృద్ధిని వేగవంతం చేసేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను బడ్జెట్ కొనసాగిస్తున్నదని ఆర్థిక మంత్రి సీతారామన్ అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ 'జ్ఞాన్'పైనే మా దృష్టి ఉంది. గ్యాన్ అంటే- పేద, యువత, ఆహార ప్రదాత, మహిళా శక్తి. గత 10 ఏళ్లలో బహుముఖ అభివృద్ధి చేశామని ఆర్థిక మంత్రి చెప్పారు.
పీఎం ధనధాన్య యోజన..
బడ్జెట్లో రైతుల కోసం ప్రధాన మంత్రి ధనధాన్య యోజనను ఆర్థిక మంత్రి ప్రకటించారు. రాష్ట్రాలతో కలిసి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. దీంతో 1.70 కోట్ల మంది రైతులకు సాయం అందుతుందని తెలిపారు. పేదలు, యువత, మహిళలు, రైతుల అభ్యున్నతిపై దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. వ్యవసాయ వృద్ధి, గ్రామీణాభివృద్ధి, తయారీపై దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. ఆర్థిక రంగ సంస్కరణలపై కూడా శ్రద్ధ చూపుతామన్నారు. 100 జిల్లాల్లో ధన్ ధాన్య యోజనను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు.
ఎంఎస్ఎంఇ..
ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కోటి కంటే ఎక్కువ ఎంఎస్ ఎంఇలు ఉన్నాయని తెలిపారు. కోట్లాది మందికి ఉపాధి దీనితో ముడిపడి ఉందని, భారత్ను తయారీ రంగంలో అగ్రగామిగా మార్చిందన్నారు. ఎక్కువ డబ్బు వచ్చేలా రెండున్నర రెట్లు పెంచుతున్నామని స్పష్టం చేశారు. దీంతో యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు క్రెడిట్ గ్యారెంటీ కవర్ను రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచుతున్నట్లు తీపికబురందించారు.
లెదర్ (తోలు) పరిశ్రమ..
భారతదేశ లెదర్ ఇండస్ర్టీ రంగానికి సహాయం చేయడమే గాకుండా, నాన్-లెదర్ పాదరక్షల కోసం ప్రణాళిక ఉందన్నారు. ఈ రంగంలో 22 లక్షల ఉపాధి లభించనుందన్నారు. రూ. 4 లక్షల కోట్ల టర్నోవర్, రూ. 1.1 లక్షల కోట్లకు పైగా ఎగుమతులు జరగవచ్చని అంచనా వేశారు. చిన్న పరిశ్రమలకు ప్రత్యేక క్రెడిట్ 10 లక్షల కార్డులు జారీ చేయనున్నామని తెలిపారు.
మత్స్యకారులు పరిశ్రమ..
సముద్రాల్లో మత్స్య రంగ ఉత్పాదకతను కొనసాగించేందుకు ప్రభుత్వం ఒక ఎనేబుల్ ఫ్రేమ్వర్క్ను తీసుకువస్తుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పాలసీ సపోర్ట్, వివరణాత్మక ఫ్రేమ్వర్క్ ద్వారా మాన్యుఫ్యాక్చరింగ్ మిషన్ చిన్న, మధ్య, పెద్ద పరిశ్రమలను కవర్ చేస్తుందన్నారు.
ఐఐటీ పాట్నా విస్తరణ..
ఐఐటీ సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఐదు ఐఐటీ లలో అదనపు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఐఐటీ పాట్నాను కూడా విస్తరిస్తామన్నారు. ఐఐటీల్లో 6,500 సీట్ల సామర్థ్యాన్ని పెంపొదిస్తామన్నారు. రూ.500 కోట్ల బడ్జెట్తో ఏఐ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయనున్నారు.
ఇండియా పోస్ట్,,
ఇండియా పోస్ట్ను పబ్లిక్ లాజిస్టిక్స్ సంస్థగా మారుస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
బీహార్కు వరాల జల్లు..
బీహార్లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల సౌకర్యాన్ని కల్పిస్తామని, పాట్నా ఎయిర్పోర్టు సామర్థ్యం విస్తరణ, మిథిలాంచల్లోని వెస్ట్రన్ కాస్ట్ కెనాల్ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామన్నారు.
పుట్టగొడుగులు..
మఖానా (ఫాక్స్ నట్–పుట్టగొడుగులు) ఉత్పత్తి, ప్రాసెసింగ్, విలువ, మార్కెటింగ్ను మెరుగుపరిచేందుకు బిహార్ లో బోర్డును ఏర్పాటు. ఎఫ్ పీవోలతో కలిసి ఫాక్స్ నట్ రైతులకు సహాయం, శిక్షణ, నూతన పద్ధతులపై శిక్షణ, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వారికి అందజేస్తామన్నారు.
స్టార్టప్ల కోసం ఫండ్..
10,000 కోట్ల ప్రభుత్వ సహకారంతో స్టార్టప్ల కోసం నిధులు ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ఐదు లక్షల మంది మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తొలిసారిగా రూ.2 కోట్ల రుణం అందించనుందని తెలిపారు. స్టార్టప్ ల కోసం ఇప్పటివరకూ అందిస్తున్న రుణాన్ని రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పెంచుతామన్నారు.
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రాడ్బ్యాండ్..
డిజిటల్ లెర్నింగ్ వనరులకు మెరుగైన ప్రాప్యత కల్పించేలా దేశంలోని అన్ని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందిస్తామన్నారు. చబడుతుందని చెప్పారు.
వచ్చేవారం ఆదాయపు పన్ను బిల్లు..
వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
కెవైసీ సరళతరం..
కెవైసీ ప్రక్రియను మరింత సరళతరం చేస్తామన్నారు. ఈ ఏడాది ఈ ప్రక్రియ సులభతరమయ్యేలా కొత్త ఏర్పాట్లను చేస్తున్నట్లు వివరించారు.
36 మందులు ట్యాక్స్ ఫ్రీ..
36 రకాల ప్రాణాలను రక్షించే మందులపై విధించే పన్నును పూర్తిగా రద్దు చేశారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు నిర్మిస్తామన్నారు. దీంతో క్యాన్సర్ చికిత్సకు మందులు తక్కువ ధరకే లభించనున్నాయి. ప్రాణాలను రక్షించే ఆరు రకాల మందులపై కస్టమ్ డ్యూటీని ఐదు శాతానికి తగ్గిస్తామని ప్రకటించారు. 2025----–26లో 200 కేంద్రాలను నిర్మించనున్నారు.
పీఎం స్వానిధి..
పట్టణ కార్మికుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు, వీధి వ్యాపారుల కోసం కొనసాగుతున్న ప్రధానమంత్రి స్వానిధి పథకం రుణ పరిమితిని రూ.30 వేలకు పెంచారు. పీఎం స్వానిధి ద్వారా ఇప్పటివరకు 68 లక్షల మంది లబ్ధి పొందారని తెలిపారు.
పెరగనున్న మెడికల్ సీట్లు..
వచ్చే ఐదేళ్లలో మెడికల్ కాలేజీలో 75 వేల సీట్లు పెంచుతామన్నారు. వచ్చే ఏడాది మెడికల్ కాలేజీలో 10 వేల సీట్లు అదనంగా రానున్నాయని తెలిపారు.