ముగ్గురంటే వామపక్షాలకు ఆందోళన
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని

రోమ్: ట్రంప్, మోదీ, మెలోనిలు తిరిగి అధికారంలోకి రావడంతో వామపక్షాలు ఆందోళన చెందుతున్నాయని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని విమర్శించారు. అమెరికాలో జరిగిన కన్జర్వేటివ్ పోలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ లో ప్రసంగిస్తూ వామపక్ష విధానాలపై విరుచుకుపడ్డారు. ఈ రకమైన భావజాలం ఉన్న వ్యక్తులు ట్రంప్ విజయంతో అత్యంత భయపడుతున్నారని చెప్పారు. ఈ ముగ్గురు మాట్లాడితే దానిని ప్రజాస్వామ్య ముప్పు అని అభివర్ణిస్తారని మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో ట్రంప్, మోదీ, మెలోనిలు కలిసి పనిచేయడం వామపక్షాలను నిరాశకు గురి చేస్తున్నాయన్నారు. 90వ దశకంలో ఉన్న నాయకులు మాట్లాడితే ఒక విధంగా, తాము మాట్లాడితే ప్రజాస్వామ్యానికి ముప్పు ఎలా పరిణమిస్తుందని నిలదీశారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు, విధానాలు, వ్యాఖ్యలు చేసేవారిని ప్రజలు నమ్మడం లేదన్నారు. వీరు ఎంత బురద జల్లాలని అనుకున్నా ప్రజలు ఆ బురదనే వారిపైనే జల్లారన్నారు. ట్రంప్ బలమైన, ప్రభావవంతమైన నాయకుడని తనకు తెలుసన్నారు. ఆయన విధానాలు ప్రపంచానికి మేలు చేస్తాయని మెలోని అభిప్రాయం వ్యక్తం చేశారు.