చత్తీస్ గఢ్ – ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ 16 మంది నక్సల్స్ మృతి
చత్తీస్ గఢ్ – ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ 16 మంది నక్సల్స్ మృతి

కోటి రివార్డు ఉన్న సీసీఎం సభ్యుడు చలపతి మృతి
వెయ్యిమందితో 10 బృందాల ప్రత్యేక ఆపరేషన్
రాయ్ పూర్: చత్తీస్ గఢ్ – ఒడిశా సరిహద్దు గరియాబంద్, భాలు డిగ్గీ అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సోమవారం రాత్రి నుంచి జరుగుతున్న ఎన్ కౌంటర్ మంగళవారం కూడా కొనసాగుతోంది. ఈ ఎన్ కౌంటర్ లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. కోటి రూపాయల రివార్డు ఉన్న జైరామ్ (చలపతి) కూడా మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఆపరేషన్ లో వెయ్యిమందికి పైగా భద్రతా దళాలు పాల్గొన్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో నక్సలైట్ పెద్ద నాయకులతోపాటు ఓ మహిళా నక్సలైట్ కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఎన్ కౌంటర్ గరియాబంద్ ఎస్పీ నిఖిల్, ఒడిశా నువాపాడ ఎస్పీ రాఘవేంద్ర, ఒడిశా డిఐజీ అఖిలేశ్వర్ సింగ్, కోబ్రా కమాండెంట్ డీఎస్ కథైట్ ల పర్యవేక్షణలో జరిగాయి.
భద్రతా దళాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ 10 టీమ్ లుగా ఒడిశా నుంచి 3 బృందాలు, చత్తీస్ గఢ్ నుంచి రెండు, మరికొన్ని మార్గాల ద్వారా ఐదు సీఆర్పీఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎన్ కౌంటర్ సమాచారం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో మూడు ఐఈడీలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సైనికులు భారీ డ్రోన్ల ద్వారా ముందుకు సాగుతూ ఆపరేషన్ ను విజయవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో ఒక సైనికుడు గాయపడగా అన్ని ఎయిర్ లిఫ్ట్ చేసి చికిత్స అందింప చేస్తున్నారు.
జయరాంరెడ్డి (60) (రామచంద్రారెడ్డి, అప్పారావు, రాము, చలపతి)పై కోటి రూపాయల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. ఇతను ఆంధ్రప్రదేశ్ చిత్తూరులోని మాటెంపల్లిలో నివాసం. పదో తరగతి వరకు చదివిన చలపతి సెంట్రల్ కమిటీ క్యాడర్కు చెందినవాడు. బస్తర్ అబూజ్ మడ్ ప్రాంతంలో ఇతను కీలకంగా వ్యవహరించేవాడు. ఇతని వద్ద ఎకె–47, ఎల్ ఎల్ ఆర్ రైఫిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా..
ఈ ఎన్ కౌంటర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. నక్సల్స్ ఉనికిని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. తాజా ఎన్ కౌంటర్ తో నక్సలిజం వెన్నువిరిచామన్నారు. నక్సల్స్ రహిత భారత్ ను నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.
..........................................