త్వరలో తేజస్ అందజేస్తాం
హెచ్ఎఎల్ ఎండీ డి.కె. సునీల్

బెంగళూరు: త్వరలోనే రక్షణ శాఖకు తేజస్ యుద్ధ విమానాలను అందజేస్తామని హెచ్ ఎఎల్ (హిందూస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్) మేనేజింగ్ డైరెక్టర్ డి.కె. సునీల్ అన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయ్యిందన్నారు. బుధవారం ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం సాంకేతిక సమస్య పరిష్కారం కావడంతో త్వరలోనే తొలివిడత విమానాలను అందిస్తామని తెలిపారు. కాగా యుద్ధ విమానాలు అందకపోవడంపై ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆందోళన వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో హెచ్ఎఎల్ డైరెక్టర్ ప్రకటన విడుదల చేశారు.
కాగా 2028 నాటికి హెచ్ ఎఎల్ 83 తేజస్ విమానాలను భారత వైమానిక దళానికి అందించే ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం విలువ రూ. 46, 898 కోట్లు. విమానాలకు ఇంజన్ తయారీ బాధ్యత అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ర్టిక్ సంస్థ రూపొందించనుంది.
తేజస్ ప్రత్యేకతలు..
– ప్రతీ గంటకు 2205 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.
– 50వేల పీట్ల ఎత్తులో ఎగురుతుంది.
– పొడవు 13.20 మీటర్లు, ఎత్తు 4.40 మీటర్లు, బరువు 6500 కిలోలు, ఒకేసారి మూడువేల కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంది.
2022లో బెంగళూరు హెచ్ ఎఎల్ ను సందర్శించిన ప్రధాని మోదీ తేజ్ యుద్ధ విమానాన్ని కోపైలెట్ గా నడిపారు.