వారిని పంపడం ఇదే తొలిసారి కాదు
విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అమెరికా 2012 నియమ నిబంధనల ప్రకారం అక్రమంగా వలస వెళుతున్న భారతీయులను వెనక్కు పంపడం ఇది తొలిసారి కాదని విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ అన్నారు. గురువారం పార్లమెంట్, రాజ్యసభల్లో వెనక్కు వచ్చిన భారతీయుల పట్ల కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఇరుసభలు 12 గంటల వరకూ వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలు పార్లమెంట్ బయట నిరసన చేపట్టాయి. 12 గంటలకు ఇరు సభలు ప్రారంభమైంది.
డీపోర్ట్ పై చర్చలు జరపలేదు..
మధ్యాహ్నం 2 గంటలకు విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ రాజ్యసభలో విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 2012 నిబంధనల ప్రకారం అమెరికా అక్రమంగా నివసిస్తున్న భారతీయులను డీపోర్ట్ చేసిందన్నారు. డీపోర్ట్ చేయడంపై అమెరికాతో భారత్ ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. ఆ దేశ చట్టాల ప్రకారమే డీపోర్ట్ చేశారని తెలిపారు. వీరిని వెనక్కు పంపిస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదన్నారు. వీరికి ఆహారం, దుస్తులను అందజేశారని తెలిపారు. అక్రమంగా నివసిస్తున్న వీరంతా అమెరికాలో మెక్సికో, కెనడా సరిహద్దులకు దగ్గరగా అమానవీయమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తొలివిడతలో అలాంటివారినే వెనక్కు పంపారని జై శంకర్ తెలిపారు.
ఎంతమంది వెనక్కు..
2009లో 734, 2010లో 799, 2011లో 596, 2012లో 530, 2013లో 550, 2014లో 591, 2015లో 708 మంది, 2016లో 1303, 2017లో 102, 2018లో 1118, 2019లో 2042, 2020లో 1889, 2021లో 805, 2022లో 862, 2024లో 1368, 2025లో 104 మందిని వెనక్కు పంపినట్లు తెలిపారు.
సోనియాపై హక్కుల ఉల్లంఘన తీర్మాణం ప్రవేశపెట్టే అవకాశం..
భారతీయులు వెనక్కు పంపడంపై విపక్షాల ఆరోపణలపై ఉదయం కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. మంత్రి జై శంకర్ సమాధానం ఇస్తారని చెప్పారు. అయినా విపక్షాలు వినిపించుకోలేదు. మహాకుంభమేళా తొక్కిసలాటపై సమాధానం చెప్పాలని నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో ఇరు సభలను 12 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు రాష్ర్టపతిపై సోనియాగాంధీ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.