మాలివాల్ పై దాడి నిందితుడిపై చర్యలేవి
వైభవ్ గుండాయిజంకు సీఎం హౌస్ కేరాఫ్ అన్న బీజేపీ.. మహిళా సంఘం సీరియస్.. నోటీసులు జారీ

నా తెలంగాణ, న్యూఢిల్లీ: స్వాతి మాలివాల్ పై దాడి జరిగి 72 గడిచినా ఇంతవరకు ఆ పార్టీ నిందితుడిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ భాటియా ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైభవ్ కుమార్ సీఎం కేజ్రీవాల్ వెంట విమానాశ్రయంలో ఉన్న ఫోటోను రిలీజ్ చేశారు. పలు విమర్శలు గుప్పించారు. ఈ ఫోటోను చూస్తే కేజ్రీవాల్, వైభవ్ కుమార్ లు కూడబలుక్కునే ఆమెపై దాడికి పాల్పడ్డారని స్పష్టం అవుతూందని మండిపడ్డారు. సీఎం హౌస్ గుండాయిజంకు కేరాఫ్ గా మారిందా? అని ప్రశ్నించారు. అఖిలేష్ తో కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహించారు. దీన్ని బట్టి చూస్తే ఈ ఫోటో బుధవారం రాత్రిదేనని అర్థం అవుతూందని స్పష్టం చేశారు. ఒక మహిళకు ఆప్ పార్టీలో ఇచ్చే గౌరవం ఇదే అని మండిపడ్డారు. తాము రాజకీయాలకు అతీతంగ సాక్షి మాలివాల్ పక్షాన ఉన్నామని గుర్తు చేశారు.
మహిళా ఎంపీని కొట్టిన వ్యక్తిని చంకలో పెట్టుకొని సీఎం తిరగడం ఏ రకమైన రాజకీయమని ప్రశ్నించారు. చర్యలుంటాయని సంజయ్ సింగ్ తెలియజేశారు. సాక్షాత్తూ సీఎం కేజ్రీవాల్ అక్రమ మద్యం కేసులో ఇరుక్కుపోతే ఆ పార్టీతో ఇంకేమీ న్యాయం ఆశించగలమన్నారు. మరోవైపు ఆమె ఫిర్యాదు చేసేందుకు వెళితే ఆమెను భయపెడుతున్నారని మండిపడ్డారు.
సీఎం కేజ్రీవాల్ వెంట బుధవారం రాత్రే లక్నో వెళ్లిన వైభవ్ కుమార్ గురువారం ఎస్పీ నాయకుడితో సమావేశం సందర్భంగా సీఎం కారులో కూర్చొని ఉండడం మీడియాకు కనిపించడం విశేషం. మొత్తానికి వైభవ్ కుమార్ దాడి సీఎం కనుసన్నల్లోనే జరిగిందనడానికి నిదర్శనమని బీజేపీ ఆరోపిస్తోంది.
మహిళా హక్కుల సంఘం సీరియస్..నోటీసులు జారీ..
మరోవైపు స్వాతి మాలివాల్ పై దాడి ఘటనపై రాష్ర్ట మహిళా హక్కుల సంఘం సీరియస్ అయింది. దీని పూర్వాపరాలేంటో తెలుసుకోవాలని మే 17వ తేదీ ఉదయం వరకు నిందితుడు వైభవ్ కుమార్ ను తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.