కేజ్రీపై తొలగని అవినీతి మరకలు!
The stains of corruption on Kejri!

హస్తం–ఆప్ ముదిరిన విబేధాలు
తాయిలాలపైనే ఆశలు
భగ్గుమంటున్న పూర్వాంచల్ ప్రజలు, నాయకులు
రోజుకో పోస్టర్ తో అవినీతిని ఎండగడుతున్న బీజేపీ
జైలు కెళ్లడం, స్వాతిమాలివాల్ పై దాడులు
అంతర్గత విబేధాలతో తలపట్టుకుంటున్న కేజ్రీవాల్
కాషాయానికి అంతకంతకూ పెరుగుతున్న మద్ధతు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఆప్ అధినేత కేజ్రీవాల్, ఆ పార్టీ నేతలపై అవినీతి మరకలు తొలగడం లేదు. పైగా ఇండి బ్లాక్ కూటమితో ఎంపీ ఎన్నికల్లో పోరాటం సల్ఫిన ఈ రెండు పార్టీలు ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సింగిల్ గానే రంగంలోకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఆప్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇంకోవైపు ఆప్ లోనూ అంతర్గత విబేధాలున్నా కేజ్రీవాల్ సమయస్ఫూర్తితో వాటిని బయటికి పొక్కనీయడం లేదనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా నేతల ఒత్తిళ్లకు తలొగ్గి కాంగ్రెస్ తో అసెంబ్లీ ఎన్నికలకు కటీఫ్ చేసి సింగిల్ గానే రంగంలోకి దిగారనే మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కేజ్రీవాల్ అవినీతి మరకలను తొలగించే ప్రయత్నంలో భాగంగా ప్రజలకు తాయిలాల ఆశ చూపుతున్నారు. గత మూడు టెర్మ్ లుగా అవకాశం ఉన్నా ఆయా పథకాలను అమలు చేయని కేజ్రీవాల్ సరిగ్గా ఎన్నికలకు ముందు పథకాలను అమలు చేస్తామని హామీ ఇస్తుండటాన్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారో? వేచి చూడాల్సిందే. ఇంకో వైపు పూర్వాంచల్ ప్రజలను కించపరిచారన్న అపవాదును మూటగట్టుకున్నారు. వారిని ఏకంగా రోహింగ్యాలతో పోల్చడంతో ఆ వర్గం కేజ్రీ పేరు చెబితేనే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చేందుకు పూర్వాంచల్ ప్రజలు, నాయకులే కీలకంగా వ్యవహరించారని చెప్పొచ్చు.
మరోవైపు బీజేపీ కేజ్రీవాల్ అవినీతిని రోజుకో రకంగా ఎండగడుతూ రసవత్తర రాజకీయాలకు తెరతీస్తోంది. రోజుకో పోస్టర్ చొప్పున అన్ని రకాల అవినీతి, తాయిలాల ప్రకటనలను నిలదీస్తుంది. ఈ పరిణామాలు కాస్త కేజ్రీవాల్ కు ఆ పార్టీ నేతలకు మింగుడుపడడం లేదు. శీష్ మహల్, మద్యం, యమునా నది నీరు, ప్రభుత్వ గృహాలు, మురికివాడల శుద్ధికరణ, వాతావరణ కాలుష్యం, ట్రాఫిక్, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాల్లో ఆప్ అధినేత అవినీతిపై ఎప్పటికప్పుడూ నివేదికలు, చిత్రాల రూపంలో రోజుకోరీతిన విడుదల చేస్తుంది. దీంతో ఆప్ నేతలు బీజేపీ నాయకులపై రీ కౌంటర్ వేస్తున్నారు.
2025 నూతన సంవత్సరంలో కేజ్రీవాల్ కు రాజకీయంగా అతిపెద్ద సవాళ్లే ఎదురవుతున్నాయి. ఆ పార్టీ నాయకులు అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లడం, అప్పటివరకూ ఆప్ లో కీలక పదవికి బాధ్యత వహించిన మహిళా నాయకురాలు స్వాతి మాలివాల్ పై దాడి, పూర్వాంచల్ ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు లాంటివి ఆయన ప్రతిష్ఠను ప్రజల్లో మసకబారుస్తున్నాయి.
గతం..
1993 బీజేపీ ఓట్ల శాతంలో పెద్దగా పెరుగుదల చోటు చేసుకోలేదు. 2020లో 30 శాతం వరకు ఓట్ షేర్ ను కలిగి ఉంది. 2008లో 40 శాతానికి పెంచుకోగలిగింది. అదే సమయంలో 2013లో గణనీయంగా 15 శాతానికి తగ్గింది. 2015లో మరింత తగ్గి 9.7 శాతంగా నమోదైంది. బీజేపీ ఓటు బ్యాంకు షేర్ ఆప్ పార్టీకి మారింది. 2024 ఎంపీ ఏడుస్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటుశాతం గణనీయంగా పెంచుకోగలిగింది. అంటే ఆప్ పార్టీకి మొగ్గుచూపిన ఓటర్లు క్రమేణా బీజేపీ వైపు మళ్లారనే సంకేతాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
చాందీనీ చౌక్ 58, ఈశాన్య న్యూ ఢిల్లీ 63, తూర్పు ఢిల్లీ 59, న్యూ ఢిల్లీ 55, వాయువ్య ఢిల్లీ 58, పశ్చిమ ఢిల్లీ 58, దక్షిణ ఢిల్లీ 56 శాతం ఓటు బ్యాంకు షేర్ ను బీజేపీ ఎంపీ ఎన్నికల్లో దక్కించుకోగలిగింది. ఈ లెక్కన చూసుకుంటే బీజేపీకి అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేదనిపిస్తోంది. మరోవైపు బీజేపీ అధిష్టానం బలం పుంజుకోవడంతోనే సరిపెట్టుకోవడం లేదు. చావో రేవో తేల్చుకోవాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో బూత్ స్థాయి నుంచి నాయకులు, కార్యకర్తలతో వరుస సదస్సులు, సమావేశాలను నిర్వహిస్తూ ప్రజాభిప్రాయం మేరకు గెలుపు గుర్రాల ఎంపికను రూపొందిస్తుంది. బీజేపీ 29 మంది అభ్యర్థులతో ఒకే జాబితాను ప్రకటించింది. త్వరలోనే రెండో జాబితా విడుదల చేయనుంది.