ప్రపంచదేశాలపై లాజరస్ హ్యాకర్ల కన్ను!
Lazarus hackers eye on the world!

జపాన్, అమెరికాలకు ముచ్చెమటలు
భారత్ అప్రమత్తం
బిట్ కాయిన్లు, క్రిప్టో కరెన్సీల దొంగతనం
కీలక డేటా తస్కరణ, బ్లాక్ మెయిలింగ్
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: భారత్ డిజిటల్ కరెన్సీ లావాదేవీల్లో ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకుంది. సాంకేతిక పరంగా కూడా ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు సేకరిస్తున్న ప్రజల డేటా సైబర్ దొంగల బారిన పడితే అనే ఆందోళన అందరిలోనూ ఉంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సైబర్ అటాక్ లను నివారించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా హ్యాకర్లు తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ వివిధ మార్గాలలో ప్రజలను బురిడీ కొట్టిస్తూ వారి సంపదనంతా దోచుకుతింటున్నారు. ఇలాంటి కేసులు కేవలం భారత్ కే కాదు.. ప్రపంచానికి కూడా పెను సవాల్ గా మారుతున్నాయి. లాజరస్ అనే సైబర్ హ్యాకర్ల గ్రూప్ ప్రస్తుతం ప్రపంచదేశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయా దేశాల ఇంటలిజెన్స్ లు ఈ ముఠా చర్యలపై దృష్టిసారిస్తూ అప్రమత్తం అయ్యాయి.
జపాన్, అమెరికాలకు బురిడీ..
లాజరస్ గ్రూప్ ఈపేరు వింటేనే ప్రస్తుతానికి ప్రపంచానికి వణుకుపుడుతోంది. ఈ గ్రూప్ సైబర్ దాడులలో దిట్ట. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ పై వివాదాస్పద, ప్రకటనలు, వీడియోలు చేస్తూ ప్రపంచాన్ని మభ్య పెట్టించారు. జపాన్, అమెరికాకు చెందిన బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీలను ఎగేసుకుపోయారు. ప్రపంచవ్యాప్తంగా అనేక కీలక డాక్యుమెంట్లు, బ్యాంకులు, సంస్థలు, ప్రభుత్వ నివేదికలున దొంగతనం చేయడంలో ఈ ముఠా సిద్ధ హస్తులు. ఇప్పటివరకూ ఈ ముఠా ఎక్కడి నుంచి పనిచేస్తుందనే విషయాన్ని కనుగొనకపోవడం విశేషం. దేశాలకు సంబంధించిన సున్నితమైన డేటాను బహిర్గతం చేస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తారు. అడిగినంత సమర్పించుకోకుంటే ఆ డేటాను బహిరంగ మార్కెట్ లో విక్రయానికి పెట్టేస్తారు.
ప్రపంచదేశాలపై నజర్..
ప్రస్తుతం ఈ గ్రూప్ దక్షిణ కొరియా, అమెరికాలను ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాయి. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బంగ్లాదేశ్, బెల్జియం, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, గ్వాటెమాల, హాంకాంగ్, ఇండియా, ఇటలీ, జపాన్, మెక్సికో, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పోలాండ్, సౌదీ అరేబియా, స్పెయిన్ , స్విట్జర్లాండ్ , థాయిలాండ్, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్ లాంటి దేశాలపై కూడా ఈ సైబర్ దాడుల ముఠా కన్నేసి ఉంచినట్లు ఆయా దేశాల ఇంటలిజెన్స్ లు అప్రమత్తత సమాచారాన్ని పంచుకున్నాయి.
కిమ్ జోంగ్ హస్తమా?
జపాన్, అమెరికాలకు చెందిన 300 మిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీ దొంగతనంపై ఉత్తర కొరియా హ్యాకర్లే కారణమని గుర్తించారు. కానీ వారు ఎవరో? గుర్తించలేదు. లాజరస్ గ్రూప్ ను ఉత్తరకొరియా ప్రభుత్వమే నడుపుతున్నట్లుగా కూడా అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో పలుమార్లు కిమ్ జోంగ్ పై ఆరోపణలు కూడా కొనసాగాయి.
ఈ గ్రూప్ ప్రముఖ దాడులు..
2014లో సోని పిక్చర్స్ నెటవర్క్ హ్యాక్. కిమ్ ఇంటర్వ్యూ ట్యాంపరింగ్. (ఫేక్ వీడియో సృష్టి)
కోవిడ్ 19 సమయంలో ఫార్మాకంపెనీలపై సైబర్ దాడులు ఫార్మూలా దొంగిలించే యత్నం.
వివిధ దేశాల డేటా హ్యాక్. బయట పెడతామని బెదిరింపులు. భారీ ఎత్తు వసూళ్లకు పాల్పడింది. కానీ ఈ విషయాన్ని ఆయా దేశాలు బయటికి పొక్కనీయలేదు.
2015లో ఈక్వెడార్ లోని బాంకో డెల్ ఆస్ర్టో ఉంచి 12 మిలియన్ల యూఎస్ డాలర్లు, వియత్నాం టియన్ ఫాంగ్ బ్యాంక్ నుంచి 1 మిలియన్ యూఎస్ డాలర్ల సంపదను దోచుకుంది.
పోలాండ్, మెక్సికో, బంగ్లాదేశ్ బ్యాంకుల ద్వారా 81 మిలియన్ యూఎస్ డాలర్లను కూడా దోచుకున్నట్లు ఆరోపణలున్నాయి.
2017లో తైవాన్ ఫార్ ఈస్టర్న్ ఇంటర్నేషనల్ బ్యాంక్ నుంచి 60 మిలియన్ల డాలర్లను దొంగిలించింది.