మణిపూర్ లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
20 సీఆర్పీఎఫ్ అదనపు బృందాలు

ఇంఫాల్: మణిపూర్ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సోమవారం కుకీ ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ తరువాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కుకీ వర్గం వారుపెద్ద యెత్తున ఆందోళనలకు, విధ్వంసాలకు దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉండడంతో కేంద్రం వెంటనే 20 కంపెనీల సీఆర్పీఎఫ్ అదనపు బలగాలను బుధవారం ఉదయం రంగంలోకి దింపింది. మంగళవారం రాత్రే ఉత్తర్వులు జారీ చేసినా రోడ్డు మార్గాల ఆలస్యం కానుండడంతో బలగాలను రక్షణ బృందాల హెలికాప్టర్ల ద్వారా నేరుగా మణిపూర్ కు పంపింది. 20 బృందాలకు సంబంధించి రెండువేల మంది సైనికులున్నారు. వీరిని ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతాల్లో మోహరించనున్నారు. సోమవారం ఎన్ కౌంటర్ లో కుకీ ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలను కూడా భద్రతా బలగాలు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై కేంద్ర నిఘా వర్గాలు ఆరాతీసేందుకు రంగంలోకి దిగాయి. నవంబర్ 30 వరకు అదనపు బలగాలు ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతాల్లోనే ఉండనున్నాయి.