వరుణాస్త్ర కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్
Green signal for purchase of Varunastra

రూ. 54వేల కోట్ల గ్రాంట్ కు ఆమోదం
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిర్ణయం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ నావికాదళం మరింత బలోపేతానికి రక్షణ శాఖ నడుం బిగించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఉన్నతాధికారుల భేటీ నిర్వహించారు. ఈ భేటీలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, నేవీ కోసం వరుణాస్ర్త కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సమావేశంలో సైన్యంలోని మూడు విభాగాలకు రూ. 54వేల కోట్ల గ్రాంట్ ను ఆమోదించారు. ఇందులో నేవీకోసం వరుణాస్ర్తం కూడా ఉంది. సముద్రంలో చైనా–పాక్ నుంచి ఎదురవుతున్న సవాళ్లను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోనుంది. 2016లో భారత నౌకాదళంలో వరుణాస్త్రను చేర్చారు. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన టార్పెడో. దీని అభివృద్ధికి 130కి పైగా సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. నీటి అడుగు భాగాన నిర్దేశించిన లక్ష్యాన్ని ఖచ్చితంగా నాశనం చేసే సామర్థ్యం కలిగి ఉంది. బరువు 1600 కిలోలు, 250 కిలోల పేలుడు పదార్థం మోసుకెళ్లగలదు. ఒక్కసారి ప్రయోగిస్తే 40 నుంచి 50 కి.మీ. వేగంతో 600 మీటర్ల సముద్రం అడుగుభాగంలో ప్రయాణిస్తూ లక్ష్యాన్ని మట్టుపెడుతుంది. వరుణాస్త్ర టార్పెడో అడ్వాన్స్ వెర్షన్ ను రూపొందించే పనిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉంది. ఇప్పటికే ఈ రకమైన టార్పెడోలు నౌకాదళానికి చెందిన పలు యుద్ధనౌకల్లో అమర్చారు. నీలిసముద్రంలో చైనా బెదిరింపులకు వరుణాస్త్ర చెక్ పెట్టనుంది. పాక్ కు దడ పుట్టించనుంది.